ఫీజు చెల్లించిందెందరు?

30 Oct, 2018 02:02 IST|Sakshi

లక్షల మంది ఇంటర్‌ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు వివరాలు గల్లంతు

సాక్షి, హైదరాబాద్‌: - హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ తమ వద్ద ఉన్న 450 మంది విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు తీసుకుంది. బోర్డు వెబ్‌సైట్‌లోని కాలేజీ లాగిన్‌కు వెళ్లి మొదటి విడతలో అందులోని 250 మంది విద్యార్థుల జాబితాను సెలెక్ట్‌ చేసి, ఫీజు చెల్లింపు ఆప్షన్‌ క్లిక్‌ చేసి వారి పరీక్ష ఫీజును చెల్లించింది. అయితే ఆ చెల్లింపు పూర్తయ్యాక తమ లాగిన్‌లో ఏయే విద్యార్థుల ఫీజు చెల్లించారు.. ఇంకా ఏయే విద్యార్థుల ఫీజు చెల్లించాలి.. అనే జాబితా వేర్వేరుగా రావాలి. కానీ ఆ వివరాలేవీ రావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక కాలేజీ యాజమాన్యం తలపట్టుకుంది. 
ఫలక్‌నుమా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ.. విద్యార్థులకు సంబంధించిన రూ. 50 వేల ఫీజు చెల్లించారు. బోర్డు వెబ్‌సైట్‌లో రూ. 50 వేలు చెల్లించినట్లు ఉంది. కానీ బోర్డు అకౌంట్‌కు చేరింది రూ. 20 వేలు మాత్రమే. ఇలా తప్పుల తడకగా సమాచారం ఉన్న కాలేజీలు వెయ్యి వరకు ఉన్నట్లు తెలిసింది. 
ఇలా రాష్ట్రంలోని లక్షల మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు, వారి పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన వివరాలు గల్లంతయ్యాయి. వచ్చే మార్చిలో పరీక్షలకు హాజరయ్యే దాదాపు 11 లక్షల మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థుల్లో ఇప్పటివరకు ఎంత మంది ఫీజులు చెల్లించారో.. ఎంత మంది చెల్లించలేదోనన్న వివరాలు తెలియక యాజమాన్యాలు తల పట్టుకుంటున్నాయి. పరీక్ష ఫీజులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ సమస్యతో ఈ గందరగోళం నెలకొంది. ఆమ్యామ్యాలకు అలవాటుపడిన బోర్డు ఉన్నతాధికారులు ఓ ప్రైవేటు సంస్థకు విద్యార్థుల డేటా, రిజల్ట్‌ ప్రాసెస్‌ పనులను అప్పగించడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినట్లు ఆన్‌లైన్‌లో లేకపోతే రేపు పరీక్షల సమయంలో వారికి హాల్‌టికెట్లు రావు. దీంతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వాపోతున్నారు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ను కాదని, ఓ ప్రైవేటు సంస్థకు డేటా ప్రాసెసింగ్‌ పనులను అప్పగించినందునే సమస్య తలెత్తిందని పేర్కొంటున్నారు. అంతేకాదు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బోర్డు కార్యదర్శికి సూచించినా పట్టించుకోకపోగా, అదే సాఫ్ట్‌వేర్‌ సంస్థను వెనకేసుకు వస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొంచి ఉన్న ప్రమాదాన్ని బోర్డు కార్యదర్శికి చెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోకపోవడంతో పరీక్షల నియంత్రణాధికారి సెలవుపై వెళ్లిపోయినట్లు తెలిసింది. బోర్డు పరీక్షల విభాగంలో మరికొంత మంది సిబ్బంది కూడా అదే బాట పడుతున్నట్లు సమాచారం. 

ఆది నుంచీ అక్రమాలు, అడ్డగోలు విధానాలే.. 
రాష్ట్రంలో ఏటా దాదాపు 11 లక్షల మంది విద్యార్థుల వివరాలు, వారి అడ్మిషన్లు, పరీక్ష ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్ల జనరేట్‌ చేయడం, పరీక్ష ఫలితాల వెల్లడి వంటి వ్యవహారాలను చూడాల్సిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ నిర్వాకం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. భారీగా ముడుపులు పుచ్చుకొని సామర్థ్యంలేని సంస్థకు పనులను అప్పగించి బోర్డు అధికారులు భారీ తప్పిదానికి కారణమయ్యారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 11 లక్షల మంది విద్యార్థుల డేటా ప్రాసెస్‌ చేయాల్సి ఉండగా, కేవలం 3 లక్షల మంది విద్యార్థుల డాటా ప్రాసెస్‌ చేస్తే చాలన్న నిబంధనను.. సదరు సాఫ్ట్‌వేర్‌ సంస్థకు అనుగుణంగా రూపొందించి భారీ తప్పిదం చేశారు. టెక్నికల్‌ సామర్థ్యాలను పట్టించుకోకుండా మూడేళ్ల కోసం రూ. 4.5 కోట్ల పనులను అప్పగించారు. టెండరు నిబంధనల ప్రకారం.. సదరు సంస్థ తమ పనితీరును నిరూపించుకునేందుకు గత సంవత్సరపు పరీక్షల డేటా ప్రకారం ఫలితాలు ప్రాసెస్‌ చేయాల్సి ఉంది. కానీ ఆ పనిని కూడా ఆ సంస్థ చేయలేదు. అంతేకాదు ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థుల సమాచారం సేకరణ పనులను కూడా చేయలేదు. జూన్‌లో ప్రవేశాలు మొదలైనా జూలై వరకు కూడా చేయలేదు. బోర్డు కార్యదర్శి సదరు సంస్థనే వెనకేసుకొచ్చారు. నిర్ణీత గడువులో పని చేయకపోయినా పట్టించుకోలేదు. టెండరు నిబంధనల ప్రకారం కనీసం జరిమానా వేయలేదు.  

9 లక్షల మంది ఫీజుపై గందరగోళం... 
ప్రభుత్వ సంస్థ అయిన సీజీజీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమాచారం సేకరించి దాన్ని తాము ఎంపిక చేసి సంస్థకు అప్పగించారు. కనీసం ఆ సేకరించిన సమాచారం ప్రకారమైనా పక్కాగా విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టిందా.. అంటే అదీ లేదు. పక్కాగా ప్రోగ్రాంను రూపొ ందించలేదు. దీంతో సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి బోర్డుకు ఫీజు చెల్లింపు ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రారంభానికి నోచుకోలేదు. చివరకు అక్టోబర్‌ 16న ప్రారంభించారు. ఈ నెల 24తో ముగిసే నాటికి లక్ష మంది విద్యార్థుల ఫీజుల చెల్లింపు వివరాలు కూడా బోర్డుకు అందలేదు. కానీ బోర్డు అధికారులు మాత్రం 2.13 లక్షల మంది విద్యార్థుల ఫీజు వివరాలు వచ్చాయని చెబుతున్నారు. మరి మిగతా 9 లక్షల మంది విద్యార్థుల ఫీజుల వివరాలపై గందరగోళమే నెలకొంది. ఈనెల 31 వరకు గడువు పొడిగించినా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏ కాలేజీ నుంచి ఎంత మంది విద్యార్థుల ఫీజులు వచ్చాయి అన్నది బోర్డుకే తెలియని గందరగోళం నెలకొంది. అంతేకాదు కాలేజీ యాజమాన్యాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. వారు విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేశారు కానీ బోర్డుకు ఎంత మంది ఫీజులు చేరాయి.. ఇంకా ఎంత మంది ఫీజులు చెల్లించాలన్న విషయంలో స్పష్టత లేకుండాపోయింది.

బోర్డు చుట్టూ ప్రదక్షిణలు
బోర్డు వెబ్‌సైట్‌లోని తమ కాలేజీ లాగిన్‌లోకి వెళితే ఆ వివరాలేవీ రావడం లేదని కొన్ని యాజమాన్యాలు, వస్తున్న వివరాల్లోనూ అనేక తప్పులు ఉన్నాయని మరికొన్ని యాజమాన్యాలు, డబ్బులు చెల్లించినా అప్‌డేట్‌ కాలేదని ఇంకొన్ని కాలేజీలు బోర్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. అయినా బోర్డు అధికారులు కానీ, సెక్రటరీ కానీ కనీసం స్పందించడం లేదని వారు వాపోతున్నారు. చివరకు ఈ గందరగోళం పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బోర్డు కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో పరీక్షల నియంత్రణాధికారి సెలవుపై వెళ్లిపోయారు. ఆ విభాగంలోని మరికొందరు అధికారులు అదే బాటపట్టారు. ఈ వ్యవహారంలో బోర్డు కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం నెలకొందని ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ పి. మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. సామర్థ్యంలేని సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసి, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు