-
బాలలను ఆకట్టుకుంటున్న మైమ్ నాటకాలు
సాక్షి, సిటీబ్యూరో: పిల్లల కోసం రూపొందించిన అంతర్జాతీయ నాటకాలు నగరంలో ప్రారంభమయ్యాయి. రంగ శంకర బెంగళూరు వారి ఆధ్వర్యంలో వీటిని ప్రదర్శిస్తున్నారు. గత రెండేళ్లుగా అహ్మదాబాద్లో జరుపుతున్న నాటకోత్సవాలను ప్రస్తుతం హైదరాబాద్లోనూ ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నాటకాలకు నగర బాలలకు పరిచయం చేయడం అభినందించదగిన విషయమంటున్నారు తమ పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు. మాటలు లేని, అభినయ ప్రధానమైన మైమ్ నాటకాలు కావటంతో మరింత ఆసక్తిగా ఉన్నాయంటున్నారు చిన్నారులు.
జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో కూడిన ఈ నాటకోత్సవాలు ఈ నెల 19 వరకు సప్తపర్ణిలో ప్రదర్శించనున్నారు. జర్మనీ, యూకే, అమెరికా, పెరూ, స్విట్జర్లాండ్, ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చిన కళాకారులు నాటకాలను ప్రదర్శిస్తున్నారు. నాటక ప్రదర్శనల వివరాలు ఇలా ఉన్నాయి. 15న మై షో అండ్ మీ (యూకే), 16న గుల్లివర్ (ఢిల్లీ), 17న బాడీ రాప్సోడీ (పెరూ), 18న కార్నివాల్ ఆఫ్ ట్రాన్స్ఫిగరో (స్విట్జర్లాండ్), 19న సర్కిల్ ఆఫ్ లైఫ్ (బెంగళూరు). సప్తపర్ణి, రోడ్ నెం.8 బంజారాహిల్స్లో వీటిని ఉదయం 11గంటలకు, రాత్రి 7.30 గంటలకుప్రదర్శిస్తారు.