కంపించిన మినర్వా కాంప్లెక్స్‌

28 Feb, 2020 08:51 IST|Sakshi
మినర్వా కాంపెక్స్‌

పరుగులు తీసిన ప్రజలు

బ్యాంక్‌లోని భారీ లాకర్లు తరలిస్తుండగా ప్రకంపనలు వచ్చినట్లు గుర్తింపు

జీహెచ్‌ఎంసీ ఆధికారుల పరిశీలన

రాంగోపాల్‌పేట్‌:ఉదయం11గంటలు...ఎస్డీరోడ్‌లోని మినర్వాకాంప్లెక్స్‌లో ఉండే కార్యాలయాల్లో ఉద్యోగులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు...అప్పుడప్పుడే షాపులు తెరుచుకుంటున్నాయి...ఉన్నట్లుండి కాంప్లెక్స్‌లోని కొన్ని ప్లోర్లలో ప్రకంపనలు కనిపించాయి. టేబుళ్లపై ఉన్న కంప్యూటర్లు కదులుతుండటంతో భూ కంపం వచ్చిందని భావించిన ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. అందరూ కాంప్లెక్స్‌ బయటికి వచ్చి ఏమి జరుగుతుందోనని ఆందోళనలో కాలం గడిపారు. దీనిపై సమాచారం అండంతో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హడావిడిగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే సెల్లార్‌లో ఉండే బ్యాంకు లాకర్లను తరలిస్తుండటంతో వస్తువులు కంపించినట్లు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా లాకర్ల తరలిస్తుంటేనే భవనాలు కంపించడంతో భవనం పటిష్టతపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎస్డీరోడ్‌ మినర్వా కాంప్లెక్స్‌ ఏడు అంతస్తులతో కొనసాగుతుంది. 1980 సంవత్సరంలో ఈ కాంప్లెక్స్‌ను నిర్మించారు. సెల్లార్‌లో ఉన్న అలహాబాద్‌ బ్యాంకును పీజీ రోడ్‌కు తరలిస్తున్న నేపథ్యంలో అందులోని లాకర్లను గురువారం ఉదయం బయటికి తీసుకువచ్చారు. ఒక్కో లాకర్‌ భారీగా ఉండటంతో వాటిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నంలో కాంప్లెక్స్‌ కంపించింది. దీంతో 3, 5వ ప్లోర్లలో ఎక్కువగా కదలికలు కనిపించాయి. 3వ ప్లోర్‌లోని   ఓ బ్యాంకులో కంప్యూటర్లు కదలిపోవడంతో ఆందోళనకు గురైన సిబ్బంది బయటికి పరుగు తీశారు. ఒక ఆఫీస్‌లో సింకు విరిగి కింద పడిపోయింది. కొన్ని గ్లాసులు పగిలిపోయాయి. దీంతో వందల సంఖ్యలో ఉద్యోగులు కార్యాలయాలను వదలి రోడ్డుపైకి వచ్చారు. ఆ కొద్దిసేపటికి కాంప్లెక్స్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది అక్కడికి వచ్చి విషయం చెప్పడంతో కొందరు ఊపిరిపీల్చుకుని మళ్లీ కాంపెక్స్‌లోని తమ కార్యాలయాల్లోకి వెళ్లారు. మరికొందరు భయంతో ఈ రోజు విధులకు రామని తెగేసి చెప్పి ఇళ్లకు వెళ్లిపోయారు. 

జీహెచ్‌ఎంసీ అధికారుల పరిశీలన
దీనిపై సమాచారం అందడంతో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ జోనల్‌ సీపీ ప్రసాద్, బేగంపేట సర్కిల్‌ ఏసీపీ ఖుద్దూస్, డీఈ ప్రశాంతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్‌కు నోటీసులు ఇచ్చి స్ట్రక్చరల్‌ స్టెబిలిటీని పరిశీలిస్తామని తెలిపారు. తమ ఇంజనీరింగ్‌ అధికారులు భవనాన్ని తనిఖీ చేస్తారని వారు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు