గనులు ఆర్థిక వ్యవస్థను మార్చేస్తాయి

24 Oct, 2019 04:50 IST|Sakshi

శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి మైనింగ్‌ రంగానికి ఉందని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రగతిని గనులు నిర్దేశిస్తాయని అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ (తెలంగాణ స్టేట్‌ సెంటర్‌) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌ ఆడిటోరియంలో ‘మైనింగ్‌– ప్రజెంట్‌ అండ్‌ ఫ్యూచర్‌–ఇన్వెస్టిమెంట్స్, ఇష్యూస్‌ అండ్‌ ఛాలెంజెస్‌’అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి మైనింగ్‌ ఇంజనీర్లు, మేధావులు, నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవం అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థకు మూలం గనులేనని, వాటిని క్రమపద్ధతిలో వినియోగించుకుంటే అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మైనింగ్‌లో విప్లవాత్మక మార్పులు జరిగాయని, ఆదాయం కూడా భారీగా పెరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004–2013 మధ్య కాలంలో ఇసుకపై వచి్చన ఆదాయం రూ.13.66 కోట్లయితే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచి్చన ఆదాయం రూ.2,383 కోట్లని తెలిపారు. ప్రారంభోత్సవ సదస్సు అనంతరం సెషన్ల వారీగా వివిధ అంశాలపై బృంద చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాల్గొన్న యువ ఇంజనీర్లను ఉద్దేశించి వక్తలు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహముద్‌ అలీ, ఎఫ్‌ఐఈ ప్రెసిడెంట్‌ టీఎం గుణరాజా, చైర్మన్‌ డాక్టర్‌ జి.రామేశ్వరరావు, హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌ బీఆర్‌వీఎస్‌ సుశీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు