పొల్లాలోని బోర్లు కూలుతున్నాయి సార్‌...

24 Sep, 2018 12:14 IST|Sakshi
గుట్టను తొవ్వగా ఏర్పడిన గొయ్యి

ఆ పల్లె చుట్టూ ఎతైన గుట్టలు, పచ్చదనంతో ఉండే అడవి. ఓ పక్క నుంచి పొలాలకు సాగు నీటిని అందించేందుకు నిర్మించిన మహబూబ్‌ నహార్‌ కాల్వ. ఇవి కొల్చారం మండలం రాంనగర్‌ ప్రత్యేకతలు.  ప్రశాంతంగా ఉన్న  ఈ ఊరు శివారులోకి 2006లో ‘భూతంలా స్టోన్‌ క్రషర్‌ మిల్‌’ ప్రవేశించింది.  సాయంత్రం అయిందంటే భారీ స్థాయిలో బండరాళ్లను పగలగొట్టేందుకు పెద్ద శబ్దాలతో బ్లాస్టింగులు చేస్తుండడం పరిపాటిగా మారింది. ఈ శబ్దాలకు చిన్నపిల్లలు, ముసలి వాళ్లు ఉలిక్కి పడుతున్నారు. అయినా పట్టించుకునే నాథుడు లేడు. వివరాలతో పరిశోధనాత్మక కథనం                

కొల్చారం(నర్సాపూర్‌) : గ్రామానికి అరకిలో మీటరు దూరంలో బోలుగు బండ(గుట్ట). ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 12 ఏళ్ల క్రితం రెండున్నర ఎకరాలకు స్టోన్‌క్రషర్‌ ఏర్పాటుకు లీజుకు తీసుకోని క్రషర్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి క్రషర్‌ను విస్తరించే దిశగా లీజుకు తీసుకున్న వ్యక్తులు నింబంధనలను తుంగలో తొక్కుతూ వ్యాపారాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. మైనింగ్‌ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా పేలుడు పదార్థాలను ఇష్టారీతిగా వాడుతుండటంతో ఆ శబ్ధాలకు చుట్టు పక్కల ఉన్న పొల్లాలోని బోర్లు కూలుతుండటంతో పాటు పొలాలోకి వచ్చి పడుతున్న రాళ్లు, దుమ్ముతో ఇక్కడ వ్యవసాయం సాగక బీడుగా 
ఉంచవల్సిన దుస్థితి. అది కాక పక్కనే ఉన్న ఇందిరానగర్‌ కాలనీలోని ఇళ్ల గోడలు కూడా బీటలు పారుతున్నాయి.

స్టోన్‌ క్రషర్‌ యజమానులకు నాయకులతో పాటు, అధికారుల అండదండలు పుష్కలంగా  ఉన్నాయని స్థానికులు చర్చిం చుకుంటున్నారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి మైనింగ్‌ ద్వారా లీజుకు అనుమతి పొందిన సదరు యాజమానులు చుట్టు పక్కల ఉన్న రైతులను నయానో, భయానో బెదిరించి.., నాయకులను మచ్చిక చేసుకోని నాలుగు ఎకరాలకు విస్తరించారు.  అధికారులకు లక్షల్లో సొమ్ము ముట్టజెప్పడంతో వీరి వ్యాపారానికి అడ్డు అదుపు లేకుం డా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నా యి.
 
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఈ కంకర వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులు మైనింగ్‌ నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదు. నిర్ధేశించిన లోతు కన్నా ఎక్కువ మేర తవ్వ కం చేపడుతున్నారు. కంకర రవాణలోనూ ఇదే పరిస్థితి. తెల్ల కాగితాలపై బిల్లులు ఇస్తూ ఇష్టారీతిగా రవాణా సాగిస్తున్నారు. వేబిల్‌ ఎక్కడా కానరాని దుస్థితి.  

బీడుగా ఉంచుతున్నాం..
రాత్రి పూట పెద్ద ఎత్తున బ్లాస్టింగులు చేస్తున్నారు. దీంతో నీళ్లు పోసే బోర్లు కూలి నీరు అందడం లేదు. అలాగే పొలంలో రాళ్లు పడటంతో వ్యవసాయం చేయలేక భుమిని బీడుగా ఉంచుతున్నాం. ఇదేమిటని ప్రశ్నిస్తే డబ్బులు తీసుకోమని బెదిరిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. –రాము, రైతు రాంపూర్‌ 

చర్యలు తప్పవు.. 
నిబంధనలకు విరుద్ధంగా నడిచే స్టోన్‌ క్రషర్‌పై చర్యలు తీసుకుంటాం. వారికి ఇచ్చిన పరిధిలో, నిబంధనలను తప్పని సరి పాటించాలి. అతిక్రమిస్తే ఎవరిపైన అయినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. – జయరాజ్, జిల్లా మైనింగ్‌ ఏడీ

మరిన్ని వార్తలు