నాలుగైదు రోజుల్లో ‘కంది’ బకాయిల చెల్లింపు

15 Feb, 2017 02:55 IST|Sakshi
నాలుగైదు రోజుల్లో ‘కంది’ బకాయిల చెల్లింపు

అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
కంది సాగు పెరగడంతో ఆశించిన ధర రావడం లేదు
ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలూ కారణమే
పప్పు ధాన్యాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలి
దిగుమతులపై సుంకాలు విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి


సాక్షి, హైదరాబాద్‌: కంది రైతులకు బకాయి పడిన రూ.150 కోట్లను నాలుగైదు రోజుల్లో చెల్లిస్తామని మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ తదితర ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి కంది పంటను కొనుగోలు చేసినా సొమ్ము చెల్లించని వైనాన్ని వివరిస్తూ.. మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పైసలేవి సారూ!’ కథనంపై ఆయన స్పం దించారు. కంది క్రయ విక్రయాలు, వ్యవ సాయ మార్కెట్లలో తాజా పరిస్థితిపై సమీక్షించారు. చిట్టచివరి గింజ వరకు కంది కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 90 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 74 వేల టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నాఫెడ్‌ సంస్థ 49వేల టన్నులు కొనుగోలు చేసిందని, ఎఫ్‌సీఐ 25 వేల టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. రైతులకు బకాయి పడిన రూ.150 కోట్లను నాలుగైదు రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సాగు పెరగడంతో..
రాష్ట్రంలో ఇంతకు ముందు 2.47 లక్షల హెక్టార్ల కంది సాగు జరిగేదని, ఇప్పుడు 4.35 లక్షల హెక్టార్లకు పెరగడంతో.. రైతులకు ఆశించిన ధర లభించడం లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం దని చెప్పారు. కంది తదితర పంటల మార్కెట్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయ న్నారు. ఎగుమతి, దిగుమతులకు సంబంధిం చి మొజాంబిక్, టాంజానియా, మయన్మార్‌ తదితర ఆఫ్రికా దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తెలంగాణ కంది రైతులకు నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. 2016–17లో లక్ష టన్నులు, మరో మూడేళ్లలో 2 లక్షల టన్నుల కందిని దిగుమతి చేసు కోవడానికి కేంద్రం ఎంవోయూ చేసుకోవడం, శనగలు మినహా మిగతా పప్పు ధాన్యాల ఎగుమతిని కేంద్ర ప్రభుత్వ 2006 ఎగుమతి విధానంలో నిషేధించడంతో ఈ సమస్య తలె త్తిందన్నారు.

అంతేగాకుండా పప్పు ధాన్యాల దిగుమతులపై సుంకాన్ని ఎత్తివేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని, దిగుమతులపై సుంకాన్ని పెంచితేనే దేశంలోని రైతులకు మంచి ధర లభిస్తుందని స్పష్టం చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌కు తాను ఇదివరకే లేఖ రాశానని మంత్రి వెల్లడించారు. పప్పుధాన్యాల ఎగుమతి విధానాన్ని సులభతరం చేయాలని.. నిల్వలపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఈసారి భారీగా కంది దిగుబడులు వచ్చినందున మార్కెట్లో ధర తగ్గినట్టు మంత్రి విశ్లేషించారు. కంది రైతుల సమస్యలు, ఫిర్యాదుల కోసం జనవరి 21న ప్రారంభించిన కాల్‌ సెంటర్‌ పనితీరును సమీక్షించారు. దీనికి ఇప్పటివరకు 305కు పైగా ఫిర్యాదులు అందినట్టు మార్కెటింగ్‌ అధికారులు మంత్రి దృష్టికి తీసు కొచ్చారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్య లు తీసుకోవాలని హరీశ్‌ ఆదేశించారు.

మరిన్ని వార్తలు