'పద్మాదేవేందర్ కృషితో రామాయంపేట అభివృద్ధి'

5 Nov, 2015 18:15 IST|Sakshi

రామాయంపేట (మెదక్ జిల్లా) : డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కృషితో రామాయంపేట మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన గురువారం రామాయంపేటలోని రైతుబజార్‌లో రూ.50లక్షలతో అదనపు పనులకు శంకుస్థాపన గావించిన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో రోడ్డు విస్తరణకు రూ.7.80 కోట్లతోపాటు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో అభివృద్ది పనులకు రూ.4 కోట్లు, తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికిగాను రూ. కోటి మంజూరయ్యాయన్నారు.

స్థానికంగా ఉన్న మల్లె చెరువును మినీ ట్యాంక్‌బండుగా మారుస్తామని, త్వరలో గెస్ట్ హౌస్ నిర్మాణానికిగాను నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రామాయంపేట మండలంలో కరువు పరిస్థితులు నెలకొన్న కారణంగా గోదావరి జలాలు తరలిస్తామన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులను అడ్డుకుంటున్నారని హరీష్‌రావు ఆరోపించారు.

సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జడ్‌పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి, మండల సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మానెగల్ల రామకిష్టయ్య, పున్న వెంకటస్వామి, మాజీ ఎంపీపీ సంపత్, పార్టీ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, జిల్లా నాయకుడు అందె కొండల్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, మెదక్ ఆర్డీవో మెంచు నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు