టీఏసీ అనుమతి కాంగ్రెస్‌కు చెంపపెట్టు

7 Jun, 2018 01:35 IST|Sakshi

ప్రాజెక్టుపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం 

మంత్రి హరీశ్‌రావు

జోగిపేట(అందోల్‌): రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంస్థ టీఏసీ (టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ) అనుమతి ఇవ్వడంతో ఇక అన్ని అనుమతులు పూర్తయినట్లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఆయన సంగారెడ్డి జిల్లా తాలెల్మ బహిరంగ సభలో మాట్లాడుతూ, టీఏసీ అనుమతికి సంబంధించి తనకు ఇప్పుడే ఢిల్లీ నుంచి తీపి కబురు వచ్చిం దన్నారు. విపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరానికి అన్ని అనుమతులు పొందగలిగామని, టీఏసీ అనుమతి కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టు అని అన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ రీడిజైన్‌ను జలవనరుల సంస్థ, కేంద్రం ఆమోదించిందన్నారు.

ఆప్షన్‌ లేనందునే బీమా 
ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కుటుంబ సభ్యులకు ఉద్యోగం.. ఎమ్మెల్యే, ఎంపీ చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఎన్నికల్లో గెలిపిస్తాం, మరి రైతు చనిపోతే ఏం చేస్తున్నామని..?, అందుకే సీఎం కేసీఆర్‌ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి హరీశ్‌ అన్నారు. రైతు ఎటువంటి పరిస్థితుల్లో మరణించినా వారం రోజుల్లో రూ.5 లక్షల చెక్కు అతడి ఇంటికి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబూమోహన్, ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు