రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
సాక్షి, సిద్దిపేట: ‘ఎన్ని సంపదలున్నా ఆరోగ్యమే మిన్న.. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆరోగ్య తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు’అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 30 రోజుల ప్రణాళిక అమలుతీరును పరిశీలించేందుకు మంత్రి శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం కొల్లూర్, సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి, సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి దోమల ఆవాసాలైన మురికి కాల్వలు, ఇళ్లలో వ్యర్థ వస్తువులు, పాత ఇండ్లు మొదలైన వాటిని శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు చేయడం వల్ల 15 కోట్ల మంది మరణిస్తే.. దోమలు కుట్టడం కారణం గా 20 కోట్ల మంది మరణించారని పేర్కొన్నారు.
రాజమణమ్మా నీ ఇల్లే ఇలా ఉంటే ఏలా?
‘నీవు ఆశా వర్కర్వు.. ఆరోగ్య సేవలు, పరిశుభ్రత గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత నీమీద ఉంది.. నీ ఇల్లే ఇలా ఉంటే ఏలా అమ్మా’.. అంటూ తడ్కపల్లి గ్రామంలోని ఆశావర్కర్ను మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. 30 రోజుల ప్రణాళిక అమలుతీరును పరిశీలించడంలో భాగంగా ఆయన ఆశావర్కర్ రాజమణి ఇంటికి వెళ్లారు.