తగు చర్యలు తీసుకోండి

27 Jul, 2018 01:04 IST|Sakshi

పాడి గేదెల పంపిణీపై మంత్రి తలసాని

సాక్షి, హైదరాబాద్‌: ఆగస్టు 1న పాడి గేదెల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో పశుసంవర్థకశాఖ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, విజయ డెయిరీ, మదర్‌ డెయిరీ, కరీంనగర్‌ డెయిరీ, ముల్కనూరు డెయిరీ చైర్మన్‌లు శ్రీనివాసరావు, గుత్తా జితేందర్‌రెడ్డి, రాజేశ్వరరావులతో పాడిగేదెల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష జరిపారు.

కలెక్టర్ల ఖాతాలకు ఈ పథకం నిధులు నేడో రేపో జమచేస్తామని మంత్రి తెలిపారు. డెయిరీలు వారి సభ్యుల ఆధ్వర్యంలో గేదెలు కొనుగోలు చేయడానికి కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారుడు కోరుకున్న ప్రాంతం, ఎంపిక చేసుకున్న గేదెను కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుందని, గేదె ఆరోగ్య పరిస్థితిని వైద్యుడు పరీక్ష చేసి నిర్ధారణ చేసి ఇస్తారన్నారు. యూనిట్‌ కాస్ట్‌ రూ.80 వేలుగా నిర్ణ యించామని, ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ, బీసీ లకు 50 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. దీనిపై డెయిరీల ప్రతినిధులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.  

విజయ బ్రాండ్‌కు ప్రచారం కల్పించండి  
విజయ డెయిరీ బ్రాండ్‌ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, దీని కోసం భారీ ఎత్తున ప్రచారం కల్పించాలని అధికారులకు మంత్రి తలసాని సూచించారు. విజయ డెయిరీని ప్రైవేటు సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయాలని సూచించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో సందీప్‌కుమార్‌ సుల్తానియా, విజయ డెయిరీ చైర్మన్‌లతో దీనిపై మంత్రి సమావేశం నిర్వహించారు.

మరిన్ని వార్తలు