యోధుడికి ‘ఆత్మకథ’ బహుమతి

18 Jun, 2018 01:02 IST|Sakshi
యాదవరెడ్డికి కేక్‌ తినిపిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు

     మిట్ట యాదవరెడ్డి ఇంటికి కేటీఆర్‌

     పుట్టినరోజు సందర్భంగా విష్‌ చేసిన మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకర్లకు వ్యతిరేకంగా బందూక్‌ పట్టుకుని పోరాడిన యోధుడు మా తాతయ్య. ఆయన రాసిన ఆత్మకథను తన 88వ పుట్టిన రోజున (జూన్‌ 17) ఆవిష్కరించి తాతయ్యను సర్‌ప్రైజ్‌ చేద్దామని అనుకుంటున్నాం. మీరు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారా’’అంటూ మంత్రి కె.తారకరామారావుకు 17 ఏళ్ల నిధిరెడ్డి మే 4న ట్విట్టర్‌ ద్వారా సందేశం పంపింది. సరిగ్గా 2 నిమిషాల అనంతరం కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ‘‘తప్పకుండా చేద్దాం. అలాంటి పోరాట యోధుడి కోసం నేను మీ ఇంటికి వస్తాను’’అని బదులిచ్చారు. వివరాలు పంపాలంటూ కొద్ది నిమిషాల తర్వా త కేటీఆర్‌ ఆఫీసు నుంచి మెసేజ్‌ వచ్చింది. 

కట్‌ చేస్తే..: ఆదివారం హైదరాబాద్‌ హబ్సిగూడలోని స్ట్రీట్‌ నం.7లో ఉంటున్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మిట్ట యాదవరెడ్డి ఇంటికి కేటీఆర్‌ స్వయంగా వచ్చారు. నడవలేని స్థితిలో మంచంపై ఉన్న యాదవరెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జ్ఞాపికను అందించారు. కుటుంబీకుల సమక్షంలో యాదవరెడ్డి కేక్‌ కట్‌ చేయగా, కేటీఆర్‌ కేక్‌ తినిపించారు. గతంలో ఆయన చేసిన కార్యక్రమా లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన రచించిన ‘నా జ్ఞాపకాలు’ ఆత్మకథను కేటీఆర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌  తదితరులు పాల్గొన్నారు.  

భావి తరాలకు స్ఫూర్తి: కేటీఆర్‌ 
మిట్ట యాదవ రెడ్డి మాట్లాడుతూ.. అనుక్షణం రాష్ట్రం కోసమే తపించానని అన్నారు. కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రం సిద్ధించడం, అభివృద్ధి  దిశగా నడవడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ కూడా పరిశ్రమలు, ఐటీ రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ, యాదవరెడ్డి వంటి యోధుల పోరాటమే భావి తరాల కు స్ఫూర్తి అన్నారు. చరిత్రను చూసిన యాద వరెడ్డి వంటి పెద్దల ప్రశంసలు తమను మరిం త స్ఫూర్తితో ముందుకు నడుపుతాయన్నారు.

మిట్ట యాదవరెడ్డి నేపథ్యం: జనగామ, సూర్యాపేట తాలూకాల సంగమ ప్రదేశం వెలిశాల గ్రామంలో జన్మించిన యాదవరెడ్డి 1945–47లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1947 ఆగస్టులో జాతీయ జెండా ఎగురవేసి, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదలై తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టంలో చేరి రజాకార్లకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరులో చేరారు. జనవరి 1948లో తాటికొండ గ్రామం వద్ద రజాకార్లు, నైజాం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. సాయు ధ పోలీసులు, రజాకర్లు మూకుమ్మడిగా దాడి చేయడం.. యాదవరెడ్డి దళం వద్ద మందుగుండు అయిపోవడంతో అరెస్ట్‌ అయ్యారు. చర్మం వలిచి, సూదులతో గుచ్చినా దళం ఆచూకీ కానీ, తోటీ కామ్రేడ్ల వివరాలు కానీ చెప్పని ధీశాలి ఆయన. 1951లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆర్థికశాస్త్రంలో ఎంఏ, పీహె చ్‌డీ పూర్తి చేసి ఓయూలో అధ్యాపకుడిగా పని చేశారు. సోషల్‌ౖ సెన్స్‌ విభాగానికి డీన్‌గా రిటైర్‌ అయ్యి హబ్సిగూడలో నివాసముంటున్నారు.

మరిన్ని వార్తలు