కిలో మటన్‌ రూ. 700కే అమ్మాలి : తలసాని

1 May, 2020 13:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మటన్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వారాన్ని బట్టి కొన్ని షాపుల్లో రూ. వెయ్యి వరకు ధరలను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మటన్‌ ధరలను కళ్లెం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. కిలో మటన్ రూ. 700 రూపాయలకే అమ్మాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేశించారు. అలాగే  చేపలు, కోళ్లు, గుడ్లుకు ధరలు పెరగకుండా పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామని తెలిపారు. ముందుగా నిర్ణయించిన ధరలకు మాత్రమే విక్రయించాలని, రేట్లు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. (తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌ జోన్లు)

శనివారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభించామని తెలిపారు.  తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలు, కరోనా పరీక్షలు జరుగుతున్న తీరును కేంద్ర ప్రభుత్వ అధికారులు  ప్రసంశించారని అన్నారు. వలస కార్మికుల తరలింపునకు రైళ్లు ఏర్పాటు చేయాలని తామే మొదట సూచించినట్లు తలసాని గుర్తుచేశారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. (రెడ్ ‌జోన్‌లో దేశ రాజధాని జిల్లాలు)

‘కరోనా వైరస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుని మాట్లాడాలి. బాధ్యత కలిగిన ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడు కరోనా కష్ట కాలంలో విమర్శలు చేయడం భావ్యం కాదు. నరం లేని నాలుక ఉందని, పనికి మాలిన చెత్త నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు.

మరిన్ని వార్తలు