‘గొర్రెల పంపిణీ’పై అధికారులతో సమీక్షలో మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు, రీసైక్లింగ్కు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హెచ్చరించారు. అవకతవకలను నివారించేందుకు టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవకతవకలు జరిగితే 1800 599 3699 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదులపై తక్షణమే అధికారులు స్పందించి కఠిన చర్యలు చేపడతారన్నారు.
గొర్రెల పంపిణీ పథకం, గొర్రెలకు బీమా సౌకర్యం అమలుపై పశుసంవర్ధకశాఖ అధికారులతో సచివాలయంలోని తన చాంబర్లో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధకశాఖ, విజిలెన్స్ అధికారులు టాస్క్ఫోర్స్ కమిటీలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 23,80,518 గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరణించిన గొర్రెలకు బీమా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బీమా కంపెనీ ప్రతినిధులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.