బీజేపీకి పెద్ద మొత్తంలో ఫండ్‌ ఎలా వస్తోంది: తలసాని

14 Jul, 2019 16:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీకి ముందుస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గత ఎన్నికల్లో తాము 99 స్థానాల్లో గెలుపొందామని,  ఈసారి 106 సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని గడ్డి అన్నారం, యాకత్‌పుర పరిధిలోని వినయ్‌ నగర్‌ కమిటీ హాల్‌, బహదూర్‌ పుర ప్రాంతాల్లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఉచితంగా పార్టీ సభ్యుత్వాన్ని అందిస్తున్న బీజేపీకి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్‌ ఎలా వస్తోందని ప్రశ్నించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం‍లో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు అమిత్‌ షా ఇటీవల తెలంగాణ వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వ్యాపారవేత్తలచేత బలవంతంగా సభ్యుత్వ కార్యక్రమాలు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు చేస్తోన్న కార్యక్రమాలకు ప్రజలంతా ఆకర్షితులై స్వచ్ఛందంగా సభ్యత్వం కోసం ముందుకు వస్తున్నారని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన టీఆర్‌ఎస్‌ పార్టీలో కష్టపడి పనిచేసేవారికి సముచిత గుర్తింపు లభిస్తుందని మంత్రి అన్నారు. 

>
మరిన్ని వార్తలు