విశ్వనగర యజ్ఞంలో..

20 Feb, 2019 09:43 IST|Sakshi

మంత్రి తలసాని 

‘హైదరాబాద్‌ నా సొంత గడ్డ.. ఇక్కడే పుట్టా..పెరిగా..ఇక్కడి ప్రజల ప్రేమ, అభిమానం వల్లే కేసీఆర్‌ నాయకత్వంలోనే రెండవ మారు కేబినెట్‌ మంత్రినయ్యా. సీఎం కేసీఆర్‌ నాపై ఉంచిన నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో నగర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మరింత క్రియాశీలకంగా పనిచేస్తా’ అని రాష్ట్ర నూతన పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. మంగళవారం ప్రమాణ స్వీకారం అనంతరం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రజలు, ఇక్కడి అభివృద్ధి, సమస్యలపై పూర్తి అవగాహన ఉందని,  ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలన్న అంశంపై యువ నాయకుడు కేటీఆర్‌తో కలిసి ముందుకు వెళతానని తలసాని చెప్పారు. వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో రహదారులు, మంచినీరు, పారిశుధ్యం, పచ్చదనం అంశాల్లో నగర వాసుల్ని భాగస్వాములు చేసి హైదరాబాద్‌ ప్రత్యేకతను చాటే ప్రయత్నం చేస్తానని తలసాని చెప్పారు. నగరంలో సీనియర్‌ నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలందరినీ కలుపుకు పోయి అభివృద్ధి, సలహాలు సూచనల మేరకు ముందుకు వెళతానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు