తెల్లబారిన ఎర్ర బంగారం..!

24 Jan, 2019 12:33 IST|Sakshi

నర్సంపేట రూరల్‌: ఈ సారి మిర్చి రైతుల కంట్లో కారం కొట్టినట్లయింది  తుఫాన్ల ప్రభావం మిరప పంటపై తీవ్ర ప్రభావం చూపి ది. లక్షలు పెట్టుబడి చేసి సాగు చేస్తే పెట్టుబడులు అట్లుంచితే కనీసం కూలీల డబ్బులు రాని పరిస్థితి ఉంది. చివరకు అప్పులే మిగిలాయి. జిల్లాలో వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలు ఉండగా ఎక్కువశాతం నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో మిర్చి పంట లను అధిక సంఖ్య లో సాగు చేస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలకు నర్సంపేట నియోజకర్గంలో అధిక నష్టం జరిగిం ది. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి, నర్సంపే ట, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, మండలాల్లో ఎక్కువగా మిర్చి రైతులు నష్టపోయారు. మిర్చి పంట సాగు ఒక ఎకరానికి రూ. 1.50 లక్షల ఖర్చు వస్తోంది.

దిగుబడి సుమారుగా 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా సుమారు 15 క్వింటాళ్ల నుంచి 18 క్వింటాళ్ల వరకు వచ్చింది. నాణ్యమైన మిర్చి ఉంటే రూ. 8వేల నుంచి రూ.12వేల వరకు ధర పలుకుతోంది. కాని అకాల వర్షాల దెబ్బకు పంట పూర్తిగా దెబ్బతినండంతో ఎక్కువ శాతం తాలు కాయే అయింది. దీనిని మార్కెట్‌కు తీసుకెళ్తే కనీసం ధర రూ. 2వేల నుంచి రూ. 4వేలు పలికే పరిస్థితే కనపడడంలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పంట దిగుబడి సైతం గణనీయంగా పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. మరీ తేజ కాయల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. పంటను ఏరిస్తే సుమారు రూ. 50వేల వరకు కూలీలకే చెల్లించాల్సి వస్తోందని, తీరా మార్కెట్‌కు వెళ్తే కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా పంటనష్టంపై హార్టికల్చర్‌ అధికారులతో సర్వే నిర్వహించి నష్ట పరిహారం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

పెట్టుబడి అధికం.. దిగుబడి తక్కువ..
మిర్చి పంట సాగుచేసేందుకు ఎకరానికి సుమారు పది ప్యాకెట్లు వరకు విత్తనాలు అవసరం. ఒక్కొక్క ప్యాకెట్‌ సుమారు రూ.3వేలు వరకు ధర ఉంది. కొన్ని సందర్భాల్లో ఆ గింజలు మొలకెత్తకపోతే అదనంగా మరో రెండు ప్యాకెట్ల వరకు నారు పోయాల్సి వస్తోంది. దుక్కులు, దున్నినందుకు సుమారు రూ. 10 నుంచి రూ. 15వేల ఖర్చు వస్తోంది. పంట నాటినప్పటి నుంచి కాయలు వేరడం వరకు కూలీల ఖర్చు సుమారు రూ. 50వేల నుంచి రూ. 60వేల వరకు వస్తోంది. ఎరువు, పురుగు ముందుల, ఇతర ఖర్చులతో కలిపి సుమారు రూ. 1.50 వరకు ఖర్చు వస్తోంది. దిగుబడి తగ్గడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఈ ఏడాది నెలకొన్నాయి. నాణ్యమైన మిర్చి దొడ్డు రకం సుమారు రూ. 10వేల నుంచి రూ. 15 వేల వరకు పలుకుతోంది. సన్నరకం (తేజ)కు రూ. 8వేల నుంచి రూ. 12వేల వరకు పలుకుతోంది. కనీసం ఈ ఏడాది వర్షాలకు దెబ్బతిన్న కాయ పూర్తిగా తాలు కావడంతో సుమారు రూ. 3వేలు కూడా ధర పలికే అవకాశం లేకుండాపోయింది. కూలీల డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు లబోదిబోమంటున్నారు. 

తెగుళ్లు ఎక్కువగా సోకాయి. 
మిర్చి పంట ఏపుగా పెరిగే దశలో తుపాన్ల వల్ల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో ఎక్కువ శాతం తెగుళ్లు సోకాయి. జిల్లా వ్యాప్తంగా కొంత శాతం  పంట దెబ్బతింది. వర్షం కురిసిన సమయంలో ఎక్కువ పూత దశలో ఉండడంతో పెద్ద నష్టం జరగలేదు. కాకపోతే వర్షాభావ పరిస్థితితో తెగుళ్లు అధికంగా సోకాయి. కాయలమీద ఉన్న చేను మాత్రం దెబ్బతింది. తెగుళ్ల నివారణ కాప్టన్, తైరాన్‌ పిచికారీ చేస్తే పంట బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితులను అణుగుణంగా నీటిని పంటకు అవసరమున్న మోతాదులోనే అందించాలి. లేని ఝెడల వైరస్‌లు ఎక్కువ సోకే అవకాశాలు ఉంటాయి. చలి కాలంలో సూక్షపోషకాలు తక్కువగా అందుతాయి. సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి 

మరిన్ని వార్తలు