ధర ‘తేజం’.. రైతుకు ఉత్తేజం

9 Jan, 2020 01:40 IST|Sakshi

మిర్చి క్వింటాల్‌కు రూ.21,300 పలుకుతున్న ధర

‘తేజ’రకానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండే కారణం

సాధారణ రకం రూ.17 వేలు పైనే

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది మిర్చి రైతులకు మంచి రోజు వచ్చి వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆదరణ పొందే ‘తేజ’రకం మంచి ధర పలుకుతోంది. ఇక సాధారణ రకం కూడా ఊరటనిచ్చే విధంగా ఉండటంతో మిర్చి రైతులు సంబరపడుతున్నారు. ‘మిర్చి’ధర దారుణంగా పతనమై 2017 లో రైతులు ఖమ్మం మార్కెట్‌ యార్డులో చేపట్టిన ఆందోళన, ఆగ్రహం, విధ్వంసం, అరెస్టులకు గురైన సంఘటన వారిని అప్పట్లో కలచి వేసింది. ఆ సంఘటన తర్వాత అదే ఖమ్మం మార్కెట్లో ఈ ఏడాది రైతులకు ఎంతో ఉపశమనం లభించింది.

సాధారణం కంటే...
సాధారణ రకానికి ప్రస్తుతం మార్కెట్లో రూ. 17 వేలకు పైగా ఉండగా, తేజ రకం మిర్చికి రూ. 21,300 పలికింది. గతేడాది గరిష్టంగా రూ. 10 వేలలోపు మాత్రమే ధర ఉండేది. బుధవారం ఖమ్మం మార్కెట్లో  క్వింటాలుకు రూ. 21,300 పలకడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అయ్యింది.

అంతర్జాతీయ స్థాయి డిమాండ్‌తోనే...
రాష్ట్రంలో ఖరీఫ్‌లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1.84 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 1.12 లక్షల (61%) ఎకరాల్లోనే సాగైంది. పంట సమయంలో వచి్చన భారీ వర్షాలకు అక్కడక్కడ దెబ్బతిన్నా, మొత్తంగా మంచి నాణ్యమైన పంట పండింది.దేశంలో ఇతర ప్రాంతాల్లో అధిక వర్షాలతో భారీగా దెబ్బతినిపోయింది. అలాగే మలేసియా, థాయ్‌లాండ్, సింగపూర్‌లలోనూ మిర్చి దెబ్బతిని పోయిందని వ్యాపారులు చెబుతున్నారు.దీంతో ‘తేజ’రకం మిర్చికి చైనా, సింగ పూర్, థాయ్‌లాండ్, అరబ్‌ దేశాల్లో డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

50 రోజుల్లో దాదాపు రూ. 6 వేలు అధికం...
50 రోజుల నుంచి మిర్చి పంట మార్కెట్‌కు వస్తోంది. నవంబర్‌ 18న తేజ రకం మిర్చికి రూ. 15,811 ధర పలికింది. 50 రోజుల వ్యవధిలో అది రూ. 6 వేల వరకు పెరిగి రూ. 21,300కు చేరుకుంది.గత నెల 26న ఆ రకం మిర్చి ధర రూ. 19,200 పలుకగా, 27న రూ. 400 పెరిగి రూ. 19,600కు చేరింది. అదే నెల 30 నాటికి మరో రూ. 421కు పెరిగి రూ.20,021కు చేరింది. 31వ తేదీన రూ. 20,021 పలికింది. ఈ నెల2న రూ. 21 వేలు పలికింది. ఇప్పుడు రూ. 21,300లకు చేరింది.

మరిన్ని వార్తలు