గ్రామాల్లో మిషన్‌ అంత్యోదయ సర్వే

21 Dec, 2019 08:36 IST|Sakshi

పల్లె వికాసమే లక్ష్యంగా.. సబ్‌కీ యోజన–సబ్‌కా వికాస్‌

పల్లెల్లో సౌకర్యాలపై కేంద్రం కసరత్తు

29 అంశాలు, 146 ప్రశ్నలతో సర్వే

వివరాల నమోదుకు నెలాఖరు గడువు

సాక్షి, నిజామాబాద్‌: పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలు, ఆ పల్లెల వికాసమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్‌ అంత్యోదయ క్రింద ‘సబ్‌కీ యోజన సబ్‌కా వికాస్‌’అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీ వారిగా కార్యదర్శులు 29 అంశాలలో సర్వే చేస్తున్నారు. నెలాఖరులోగా సమగ్ర సమాచారం సేకరించి ప్రత్యేక యాప్‌లో డౌన్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సర్వే తీరు తెన్నులపై ప్రత్యేక కథనం..

అన్ని శాఖల సమన్వయంతో..
కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలు,  గ్రామ పంచాయతీల అభి వృద్ధే ధ్యేయంగా అడుగు వేస్తోంది. అందులో ప్రధానంగా పేదరిక నిర్మూలన, మౌళిక వసతు ల కల్పన, మెరుగైన రవాణా, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలలో ఏ మేరకు అభివృద్ధి జరిగింది. మరేమి అభివృద్ధి జరిగాలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి. ఇందులో ప్రజల భాగస్వా మ్యం వంటి అంశాలను తెలుసుకోవడానికి మిషన్‌ అంత్యోదయ సర్వే చేపడుతుంది. ఇందు లో బాగంగా 29 అంశాలకు చెందిన సమగ్ర సమాచారం తెలిసేలా 146 ప్రశ్నలను రూపొందించారు. ఆయా ప్రశ్నల సమాధానాలతో మిషన్‌ అంత్యోదయ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 1062 గ్రామ పంచాయతీల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. 

సేకరిస్తున్న అంశాలివే..
సర్వేను పార్ట్‌–ఏ, పార్ట్‌–బీ విభాగాలుగా విభజించి సర్వే చేస్తున్నారు. పార్ట్‌ ఏలో నియోజక వర్గం, జనాభా, గృహాలు వంటి ప్రాథమిక సమచారంతో మొదలయ్యే సర్వేలో వ్యవసాయం, చిన్న నీటి వనరులు, భూ అభివృద్ధి, పశుసంవర్థక, మత్స్య, ఇంటి నిర్మాణం, తాగునీరు, రహదారులు, విద్యుత్, సామాజిక ఆస్తుల వివరాలు, భూ వివరాలు,  లైబ్రరీ, అందుబాటులో ఉన్న బ్యాంకులు,  ప్రజా పంపిణీ వ్యవస్థ, రవాణా, విద్యా సౌకర్యం, మార్కెటింగ్, ఆరోగ్యం, పారిశుధ్యం, మహిళా శిశు సంక్షేమం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఖాదీ, చేనేత, పరిశ్రమలు, సామాజిక అటవీ విభాగంచిన్న తరహా పరిశ్రమలు మొదలైన అంశాలు, పార్ట్‌ బీలో నమోదు చేస్తున్నారు. సమగ్ర, సమాచార సేకరణలో పల్లె వికాసానికి మరేం చేయాలో స్పష్టత రానుంది. 

మిగిలింది 11రోజులే..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 1062 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,334 గ్రామాలు కలవు. డిసెంబర్‌ 16 నాటికి 856 గ్రామ పంచాయతీలు మిషన్‌ అంత్యోదయ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగా 73 గ్రామ పంచాయతీలు మాత్రమే సర్వేను పూర్తి చేశాయి. రూపొందించిన  సర్వే ఆధారంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి. గ్రామ కార్యదర్శులు పారదర్శకంగా సర్వే వివరాలు నమోదు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సర్వే నత్తనడకన కొనసాగుతోంది. కొందరు గ్రామ కార్యదర్శులు కూర్చున్నచోటు నుండే సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం సేకరించి నమోదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంత మందికి అందుతున్నాయన్న సమాచారం కూడా పక్కాగా నమోదు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.  

సర్వే వివరాలు గ్రామ సభ ముందుంచాలి 
గ్రామ పంచాయతీల పరిధిలో 29 అంశాల్లో చేస్తున్న సర్వే ద్వారా ప్రతి గ్రామం యొక్క అభివృద్ధి వివరాలు తెలుస్తాయి. సర్వే వివరాలు గ్రామ సభ ముందుంచి చర్చించాలి. సర్వే వివరాలు పారదర్శకంగా నమోదు చేస్తే వచ్చే నిధులను సక్రమంగా ఖర్చు పెట్టుకోవచ్చు. 
– పెద్ది మురళి, యుఎఫ్‌ ఆర్టీఐ జిల్లా కనీ్వనర్‌ 

మరిన్ని వార్తలు