వేగంలేని ‘మిషన్’

31 May, 2015 02:31 IST|Sakshi

1,061 చెరువులకు నిధులు మంజూరు
942 చెరువులకు 933 పనులు ప్రారంభం
85లక్షల కూ.మీ. పూడికతీత
రోడ్ల నిర్మాణానికి తరలుతున్న మట్టి
 
 వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ‘మిషన్ కాకతీయ’ పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. జిల్లాలో మొత్తం 5,839 చెరువులు ఉన్నారుు. అందులో ఈ ఏడాది 1,173 చెరువులను మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు 1,061 చెరువులకు నిధులు కేటాయించింది. నిధులు మంజూరైన చెరువుల టెండర్ల ప్రక్రియను నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టారు. టెండర్లు ఖరారు అయి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. 942 చెరువులకు అగ్రిమెంటు చేసుకోగా.. 933 పనులు ప్రారంభం అయినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు పనులు చేపట్టిన చెరువుల నుంచి పూడికతీత ద్వారా సుమారు 85లక్షల క్యూబిక్  మీటర్ల మట్టిని తీసినట్లు అధికారులు వెల్లడించారు.

 మట్టికి భలే గిరాకీ..
 చెరువుల్లో తీసిన పూడికమట్టిని సొంత ప్లాట్లలో పోసుకునేందుకు పోటీపడడంతో కాంట్రాక్టర్ల పంట పండింది. సాగు భూముల్లో పోసుకుంటే సారవంతంగా తయారై అధిక దిగుబడి వస్తుందని ఊదరగొట్టిన ప్రభుత్వం బహిరంగంగా ప్రైవేటు భూములకు తరలుతుంటే పట్టించుకున్న దాఖలాలు లేవు. చెరువుల వద్ద రియల్టర్లు పెద్ద పెద్ద వాహనాలు పెట్టడంతో వారికి మాత్రమే మట్టి పోసి రైతుల ట్రాక్టర్లను పట్టించుకోని పరిస్థితులు జిల్లావ్యాప్తంగా కోకొల్లలు. ఏమిటి ఈ పరిస్థితి అని స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే.. ఆ పనుల్లో వారు భాగస్వాములు కావడంతో రైతులకు నిరాశే ఎదురువుతోంది. కొందరు చెరువు మట్టి పొలాలకు పనికి రాదన్న నివేదికలను డూప్లికేట్ తయారు చేయించి మట్టిని రహదారుల నిర్మాణాలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 పనులన్నీ ప్రారంభం..
 కాగా, వరంగల్, మహబూబాబాద్, ములుగు, స్పెషల్ ఎంఐ డివిజన్లలో చేపట్టిన పనులన్నీ ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. అరుుతే మహబూబాబాద్ పట్టణంలోని బంధం చెరువు పనులు నిలిచిపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పనులు ప్రారంభం కాలేదు. నెల్లికుదురు మండలంలో 13 పనులకు టెండర్లు కాగా.. ప్రస్తుతం 5 చెరువుల్లో పనులు సాగుతున్నాయి. గూడూరు మండలంలో మొత్తం చెరువుల పనులు సాగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

అటవీ శాఖ అభ్యంతరాలతో పనులు ఆగినట్లు చెబుతున్న కొత్తగూడ, గూడూరు, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, భూపాలపల్లి మండలాల్లో పనులు మొత్తం పురోగతిలో ఉన్నట్లు నివేదికల చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో జరగడం లేదని తె లిసింది. కేసముద్రం మండలంలో 16 చెరువులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాగా.. ప్రస్తుతం నాలుగు చెరువుల్లో పనులు నిలిచిపోయాయి.

 రఘునాథపల్లి మండలంలో 19 చెరువులకు నిధులు మంజూరు కాగా.. 5 చెరువుల పనులు ప్రారంభం కాలేదు. 4 చెరువుల పనులు ప్రారంభం అయిన వివిధ కారణాలతో నిలిచిపోయూరుు. 6 చెరువుల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలో మంజూరైన చెరువుల్లో 5 చె రువులకు టెండర్లు కాలేదు. మరో 8 చెరువుల్లో పనులు జరగడం లేదు. ఏటూరునాగారంలో 32 చెరువులకు.. 12 చెరువుల పనులు నిలిచిపోయాయి. దీనికి అటవీ శాఖ అధికారులే కారణమని ఐబీ అధికారులు అంటున్నారు.

మంగపేట మండలంలో ఐబీలో 13 మంజూరుకాగా.. 2 చెరువుల్లో పనులు జరగడం లేదు. ఎంఐలో 12 చెరువులు మంజూరు కాగా.. 8 చెరువుల్లో పనులు జరగడం లేదు. కొత్తగూడ మండలంలో ఎంఐ డివిజన్‌లో 92 మంజూరు కాగా.. 70 చెరువుల పనులు పురోగతిలో ఉన్నారుు. ఐబీలో 42 మంజూరు కాగా.. 20 పురోగతిలో ఉన్నాయి. ఈ మండలంలోని చెరువులన్నీ అటవీ ప్రాంతంలో ఉన్నందున శాఖ ప్రతిబంధకంగా తయారైందని ఐబీ అధికారులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు