‘మిషన్’కు ఏడాది

12 Mar, 2016 01:52 IST|Sakshi

వర్షాలు లేక  ఎండిపోయిన చెరువులు
నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
ముసుగు తొలగని పైలాన్
మిషన్-2పై రాజకీయ నీడ

 
వరంగల్: చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయింది. జిల్లాలో చిన్న నీటి వనరుల విభాగంలో 5,839 చెరువులు ఉన్నాయి. వీటి కింద 3,55,187 ఎకరాల సాగు భూమి ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఈ చెరువులను అభివృద్ధి చేయూలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. మిషన్ కాకతీయ కింద మొదటి దశలో 1,075 చెరువులను గుర్తించారు. వీటి పునద్ధరణకు ప్రభుత్వం రూ.418కోట్లు కేటాయించింది. ఇందులో 1,063 చెరువులకు ఈ ప్రొక్యూర్‌మెంటు పద్ధతిలో టెండర్లు నిర్వహించగా కాంట్రాక్టర్లు పోటీపడి పనులు దక్కించుకున్నారు. వీటిలో రెవెన్యూ, అటవీ శాఖల అభ్యంతరాల వల్ల కొన్ని చెరువుల పనులను అధికారులు చేపట్టలేక పోయారు. గత ఏడాది చేపట్టిన పునరుద్ధరణలో 26 చెరువులు 100 శాతం పూర్తి కాగా, 566 చెరువులు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని చెరువుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పనులు చేపట్టిన 881 చెరువులకు అధికారులు చెల్లింపులు కూడా చేశారు. మొదటి విడతలో చేపట్టిన చెరువుల నుంచి సుమారు 1,05,86,843 క్యూబిక్ మీటర్ల మట్టిని పూడిక తీసినట్టు అధికారులు పేర్కొన్నారు.  
 
వట్టిపోయిన చెరువులు

 మిషన్ కాకతీయ మొదటి విడతలో చేపట్టిన చెరువుల్లో ఎక్కువ శాతం నీళ్లు లేక ఎండిపోయూయి. మిషన్-1 పనులను 2015 జనవరిలో ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఫలితంగా సాధ్యం కాలేదు. వివిధ కారణాల వల్ల చెరువుల నిధుల కేటాయింపుల్లో ఆలస్యం కావడం, రుతుపవనాలు జూన్‌లోనే వచ్చి వర్షాలు పడడంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. చెరువులు మరమ్మతులు చేసినప్పటికీ అనుకున్న వర్షపాతం లేక పోవడం వల్ల ములుగు, మహబూబాబాద్ ఐబీ డివిజన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో చెరువులు నీళ్లు లేక బోసిపోయాయి. అధికారులు చెరువుల మరమ్మతులు పూర్తయినట్లు చెబుతున్నా ఆయా చెరువులు పూర్తి స్థాయిలో పునరుద్ధరణకు నోచుకోలేదు.
 
మిషన్-2లో 1268 చెరువులు
 మిషన్-2లో 1095 చెరువులను పునరుద్ధరించేందుకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపగా.. 493 చెరువులకు పరిపాలన మంజూరు వచ్చింది. ఇందులో 334 చెరువులకు సాంకేతిక అనుమతి లభించగా 298 చెరువులకు టెండర్లు నిర్వహించారు. టెండర్లలో చెరువుల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు 123 చెరువుల పనులు చేసేందుకు అగ్రిమెంటు ప్రక్రియ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. ఈ విడత పనులపై రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో టెండర్ల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నుట్ల ప్రచారం జరుగుతోంది.
 
అలంకారప్రాయంగా ‘మిషన్’ పైలాన్
 మిషన్ కాకతీయ చిహ్నంగా రూ.42లక్షలతో నిర్మించిన పైలాన్ ఏడాదిగా ఆవిష్కరణకు నోచుకోవడం లేదు. కేంద్ర మంత్రి ఉమాభారతి పర్యటన రెండుసార్లు ఖరారై వారుుదాపడింది. ఈ పైలాన్ ఆవిష్కరణ కొలిక్కి రాకపోవడం, సమయం మించిపోతుండడంతో ప్రభుత్వం చెరువుల పనులు ప్రారంభించింది. మిషన్ కాకతీయ రెండో దశ మొదలైనా పైలాన్‌ను ప్రారంభించపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
 
 

>
మరిన్ని వార్తలు