సాక్షి, హైదరాబాద్: కేఎం పాండు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మందికి పైగా బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్ బహుమతులు ప్రదానం చేశారు. 55 కేజీల నుంచి 100 కేజీల వరకు మొత్తం 10 రౌండ్లలో పోటీలు జరిగాయి. ఒక్కో రౌండ్లో మొదటి స్థానంలో 10 మందిని ఎంపిక చేసి మిస్టర్ తెలంగాణ పోటీలు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ వాజ్పేయినగర్కు చెందిన కట్టా కుమార్ మిస్టర్ తెలంగాణ–2019 విజేతగా నిలిచాడు. 2018 ఆగస్టులో రామంతాపూర్లో జరిగిన మిస్టర్ తెలంగాణ పోటీల్లోనూ కుమార్ విజేతగా నిలిచాడు.