అశ్రునయనాల మధ్య ప్రభాకర్‌ అంత్యక్రియలు

24 Aug, 2018 14:19 IST|Sakshi
 ప్రభాకర్‌ అంతిమయాత్రలో కుటుంబసభ్యులు   

పార్టీలకతీతంగా తరలివచ్చిన అభిమానులు

పరామర్శించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ప్రభాకర్‌రెడ్డి

కరీంనగర్‌ : కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సోదరుడు గంగుల ప్రభాకర్‌ అంత్యక్రియలు గురువారం అశ్రునయనాల మధ్య సప్తగిరికాలనీ శివారులో ఉన్న మానేరుతీరం స్వర్గధామంలో ముగిశాయి. అంతిమయాత్ర మొదలవుతుండగానే ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తన సోదరుడు ప్రభాకర్‌ మృతదేహం వద్ద బోరున విలపించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు దంపతులు, మేయర్‌ రవీందర్‌సింగ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్, సుడా చైర్మన్‌ జీవి రామక్రిష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ వాసాల రమేశ్, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్‌నాయకులు ఆది శ్రీనివాస్, సీపీఐ, సీపీఎం జిల్లా నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, టీజేఎస్‌ నాయకులు నరహరి జగ్గారెడ్డితో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కార్పొరేటర్లు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, గంగుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన ఆయా పార్టీల కార్యకర్తలు, అధికారులు, గ్రానైట్‌ క్వారీలల్లో పనిచేసే కార్మికులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. పెద్ద కుమారుడు రోహిత్‌ ప్రభాకర్‌ చితికి నిప్పంటించారు. 

మంత్రి హరీష్, ఎంపీల పరామర్శ 

‘గంగుల’ కుటుంబాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, సిద్దిపేట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వి.సతీష్‌బాబు పరామర్శించారు.

మరిన్ని వార్తలు