కుటుంబం జలసమాధి : వీడిన మిస్టరీ

22 Jun, 2020 19:39 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి, సోదరి రాధ, మేన కోడలు వినయశ్రీ కారుతో సహా  అల్గునూర్‌ శివారులో కాకతీయ కాలువలో పడి మృతి చెందిన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వీరిది ఆత్మహత్య అని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సత్యనారాయణరెడ్డి సీడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్‌ షాప్‌లో పోలీసులకు సూసైడ్‌ నోట్‌ లభించింది. సూసైడ్‌ నోట్‌ పరిశీలన అనంతరం అది స్వయంగా సత్యనారాయణరెడ్డి రాసిందేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నాలుగు నెలల తర్వాత ఈ కేసు మిస్టరీ వీడింది.(చదవండి : కుటుంబం జలసమాధి : కొనసాగుతున్న విచారణ)

కాగా, ఈ ఏడాది జనవరి 27న కరీంనగర్‌లోని బ్యాంక్‌ కాలనీలోని వారి ఇంటి నుంచి సత్యనారాయణరెడ్డి తన భార్య రాధ, కుమార్తె వినయశ్రీలతో కలిసి కారులో బయలుదేరారు. అయితే అదే రోజు వారి కారు అల్గునూరు వద్ద కాకతీయ కాలువలో పడిపోయింది. అప్పటి నుంచి వీరి ఆచూకీ కనిపించకుండా పోయింది. అయితే ఈ ఘటన జరిగిన ఇరవై రోజుల తర్వాత కరీంనగర్‌ నుంచి గన్నేరువరం బయలుదేరిన ఓ బైక్‌ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అ ప్రమాదంలో మహిళ నీటిలో కొట్టుకుపోవడంతో.. ఆమె గాలింపు కోసం కాలువలోకి విడుదలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో సత్యనారాయణరెడ్డి కారు కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేందు ఇబ్బందులు కూడా వారికి లేవని వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు