రాక్షసుల్లా తయారయ్యారు

16 Mar, 2020 04:09 IST|Sakshi

కొందరు ప్రైవేటు వైద్యులపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగిని జాయిన్‌ చేస్తే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, రాష్ట్రంలో కొంత మంది ప్రైవేటు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖ పద్దులపై ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాధి తగ్గించడం కంటే మొదట ఎన్ని ఎక్కువ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రోగి చనిపోయాక కూడా రెండు మూడు రోజులు వెంటిలేటర్లపై పెట్టి డబ్బులు గుం జుతున్నారని పేర్కొన్నారు. రోగి చనిపోతే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటికి పంపించేలా చట్టం చేయాలని కోరారు. అప్పుడే ప్రజలకు నష్టం ఉండదని, మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

డయాలసిస్‌ సెంటర్లను ప్రారంభించాలి: రాజేందర్‌రెడ్డి
వైద్యారోగ్య శాఖ పద్దులపై రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్‌ సెంటర్లను ప్రారంభించాలన్నారు. ఐసీయూలను ఏర్పాటు చేయాలన్నారు. పేదలు చనిపోతే తీసుకెళ్లే వాహనాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. సీఎస్‌ఆర్‌ కింద నీలోఫర్, సరోజినీదేవి ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని, క్యాన్సర్‌ ఆసుపత్రికి నిధులను పెంచాలని, నిమ్స్‌లో మరో 60 –70 వెంటిలేటర్లను ఏర్పాటు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు