టీఆర్‌ఎస్‌లోకి నేడు రెడ్యా నాయక్, కవిత

4 Nov, 2014 13:11 IST|Sakshi

*కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం
*వందలాది వాహనాల్లో హైదరాబాద్‌కు..

 
 డోర్నకల్/మరిపెడ/మహబూబాబాద్ :  కాంగ్రెస్‌కు చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్. రెడ్యానాయక్, ఆయన కూతురు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తమ అనుచరగణంతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. డోర్నకల్ స్థానం నుండి కాంగ్రెస్ తరఫున ఆరు సార్లు పోటీ చేసి... ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రెడ్యానాయక్ గత నెల 30న తన కూతురుతో కలిసి హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు స్వయంగా ప్రకటించారు. అనంతరం మూడు రోజులుగా రెడ్యా, కవిత తమ తమ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో విస్తృత చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం నాలుగు మండలాల నుంచి ప్రజాప్రతినిథులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరిపెడకు చేరుకుని... అక్కడి నుండి రెడ్యానాయక్‌తో కలిసి హైదరాబాద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తెలంగాణ భవన్‌కు చేరుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన కూతురు కవితతో కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు.

ఈ సందర్బంగా రెడ్యా మాట్లాడుతూ మంగళవారం కేసీఆర్ సమక్షంలో తనతో పాటు భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మం డల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల నుంచి నలుగురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యులు, 54 మంది ఎంపీటీసీ సభ్యులు, 35 మంది సర్పంచ్‌లు, ఆరుగురు సొసైటీ చైర్మన్లు, కురవి వీరభద్రస్వామి ఆలయ చైర్మన్, నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, బంగారు తెలంగాణ సాధన కోస మే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు రెడ్యానాయక్ తెలి పారు. మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ జెండా కింద పనిచేస్తానన్నారు. 100 వాహనాల్లో వేలాది మందితో కలిసి చేరుతున్నట్లు తెలిపారు.

 రెడ్యా రాక సంచలనం..

 ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కాంగ్రెస్‌ను వీడీ టీఆర్‌ఎస్‌లోకి చేరడం జిల్లాలోనే ఒక సంచలనమని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపెల్లి రవీందర్‌రావు అభిప్రాయపడ్డారు. రెడ్యానాయక్ టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా ఎంపీ సీతారాంనాయక్, నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాజయ్య మరిపెడకు వచ్చారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు.  కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతుండగా పెద్దలు తనకు మనస్ఫూర్తిగా స్వాగతం పలకడం ఆనందంగా ఉందని రెడ్యా అన్నారు. సమావేశంలో నూకల నరేష్‌రెడ్డి, గుడిపుడి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు