సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శోభ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నత విద్యావంతురాలైన దిశ ఆపద సమయంలో ధైర్యం ఎందుకు కోల్పోయిందనేది ఆలోచించాల్సిన విషయమని అన్నారు. దిశ చివరిసారిగా చెల్లెలికి ఫోన్ చేసిన సమయంలో ఆమె వాయిస్ కాల్ వింటే తను తల్లితండ్రులకు టచ్లో ఉండదని తెలుస్తోందని అన్నారు. తన తండ్రికి కాకుండా చెల్లెలికి ఆమె ఎందుకు ఫోన్ చేసిందని సందేహం వ్యక్తం చేశారు. పిల్లల పట్ల తల్లితండ్రులు ఎలా ఉండాలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. దిశ లాంటి ఘటనలు రోడ్డు మీద జరుగుతుంటాయని, వాటిని ఎవరైనా ఎలా ఆపగలరని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం మీద ఆపాదించడం సరైంది కాదని అన్నారు.
మరోవైపు దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా పోలీసుల చర్యను అందరూ ప్రశంసిస్తుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత భిన్నంగా స్పందించడం గమనార్హం. నిందితుల ఎన్కౌంటర్ బాధాకరమని ఆలేరు ఎమ్మెల్యే సునీత అంటూ నిందితుల తల్లితండ్రులు ఎంతో బాధపడి ఉంటారని ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సునీత వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిందితులను హతమార్చిందని అందరూ ప్రశంసిస్తుంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే తప్పుపట్టడం తగదని అంటున్నారు.