మేం తలచుకుంటే.. ఏముందమ్మా!

6 Jul, 2018 00:51 IST|Sakshi

డీజీపీకి చెప్తే క్యాంప్‌ బస్సును తీసుకపోయి స్టేషన్‌ల పెడ్తరు

బెల్లంపల్లి కౌన్సిలర్‌ కూతురుకి ఎమ్మెల్యే చిన్నయ్య ఫోన్‌

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టకుండా బెదిరింపులు

వైరల్‌ అయిన ఎమ్మెల్యే ఫోన్‌ సంభాషణ  

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘మేం తలచుకున్నంక ఏముంటదమ్మా.. డీజీపీకి చెప్పి ఎక్కడున్నదో క్యాంపు చూడుమంటే ఏంచేస్తడు. బస్సును తీసుకపోయి పోలీస్‌స్టేషన్‌ లోపల పెడతడు’ ‘యూసఫ్‌ది లాండ్‌ ఇష్యూ ఉంది. దాన్ల ప్రాబ్లం క్రియేటవుతది. గవర్నమెంట్‌ కబ్జా చేస్తది. రమేష్‌ లాండ్‌ గుడ గవర్నమెంట్‌ హాండోవర్‌ అవుతది. ఆడ బోర్డు బెడతరు’ ‘సుధ వాళ్ల భర్త బెల్లంపల్లి ఓసీల జాబ్‌ చేస్తుండు. ఆయన్ను రెండు రోజు లల్ల తీసుకుపోయి మణుగూరుల పడేస్తం.  

కేటీఆర్‌ తలచుకున్నంక ఎంతసేపమ్మ. ఒక్క మాట చెప్తే రేప్పొద్దున ట్రాన్స్‌ఫర్‌ చేసేస్తడు’ ‘కలెక్టర్‌ ఏం జేస్తడు. గవర్నమెంట్‌కు ఫేవర్‌గ చేస్తడు కద. అఫీషియల్‌గ ప్రొలాంగ్‌ చేపించుడో, పోస్ట్‌పోన్‌ చేయించుడా ఏదో చేస్తం’ బెల్లంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్‌ కొప్పుల సత్యవతి కూతురుతో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడిన మాటలు ఇవి. బెల్లంపల్లి మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ సునీతారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు పార్టీలకు అతీతంగా పాలకమండలిలోని 29 మంది కౌన్సిలర్లు కొద్దిరోజులుగా అజ్ఞాతంగా క్యాంపులో ఉన్నారు.

అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య క్యాంప్‌ను విచ్ఛిన్నం చేయడానికి రంగంలోకి దిగారు. కౌన్సిలర్ల ఫోన్‌లన్నీ స్విచ్‌ ఆఫ్‌ ఉండటంతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి  క్యాంపు నుంచి తిరిగి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా 34వ వార్డు కౌన్సిలర్‌ సత్యవతి కూతురుతో తొలుత మాట్లాడిన ఎమ్మెల్యే క్యాంపు నుంచి తిరిగి వచ్చేలా ఒప్పిం చమని చెప్పారు. తల్లితో మాట్లాడిన  కూతురు ఆ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పేందుకు ఫోన్‌ చేయగా  మంత్రి కేటీఆర్‌ పేరును ఉపయోగిస్తూ భయ పెట్టేలా సంభాషణ జరిపారు.

కేటీఆర్‌ తలచుకుం టే ఏమైనా జరుగుతుందని, కౌన్సిలర్లకు ఇబ్బం దులు కలుగుతాయని స్పష్టం చేశారు. మాట వినకపోతే కౌన్సిలర్ల అధీనంలో ఉన్న వివాదాస్పద భూములను సర్కార్‌ కబ్జా చేసుకుంటుందని, బెల్లంపల్లి ఓపెన్‌కాస్ట్‌లో పనిచేస్తున్న సుధ అనే కౌన్సిలర్‌ భర్తను మణుగూరుకు రెండు రోజుల్లో బదిలీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఫోన్‌ కాల్‌ లీక్‌ అయి గురువారం ఉదయాన్నే వాట్సాప్, ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫోన్‌ సంభాషణ ద్వారా వెల్లడి కావడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.  

బెల్లంపల్లి ప్రిస్టేజ్‌ ఇష్యూ   
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన సంభాషణలో మంత్రి కేటీఆర్‌ పేరును పలుమార్లు వాడుకున్నారు. ‘గవర్నమెంట్‌ తలచుకుంటే ఏమన్న అయితది. కేటీఆర్‌ ప్రిస్టేజ్‌ ఇష్యూ బెల్లంపల్లి క్యాంప్‌ అయింది’ అని ఎమ్మెల్యే సంభాషణ సాగించారు. ‘క్యాంపు నుంచి రాకుంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ టైట్‌ చేసేసి తీసు కొస్తం’ అని మాట్లాడటం చర్చనీయాంశమైంది.  

అవిశ్వాసానికి ఏడుగురు సభ్యుల నోటీసు
బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవి శ్వాసం ప్రకటిస్తూ పాలక మండలిలోని ఏడు గురు సభ్యులు జాయింట్‌ కలెక్టర్‌ సురేందర్‌రావు కు నోటీసు అందజేశారు. గురువారం కలెక్ట ర్‌ కార్యాలయంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నూనే టి సత్యనారాయణ (టీఆర్‌ఎస్‌) నేతృత్వంలోని సభ్యులు సతీష్, ఆర్‌.శారద (కాంగ్రెస్‌), బి.రాజేశ్, డి.సుజాత (టీఆర్‌ఎస్‌), టి.వంశీకృష్ణారెడ్డి, పి.రాజ్‌కుమార్‌ (ఇండిపెండెంట్లు) జేసీని కలసి అవిశ్వాసం నోటీసు అందజేశారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం కోసం పాలకమండలిని సమావేశపర్చాలని వారు కోరారు. 29 మంది సభ్యులు అవిశ్వాసం నోటీస్‌పై సంతకాలు చేశారు.  

మరిన్ని వార్తలు