‘ఆర్టీసీ చార్జీల పెంపుతో రోజుకు రూ. 2.98 కోట్ల అదనపు ఆదాయం’

29 Nov, 2019 15:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై నోటీసులు ఇచ్చినప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎందుకు పెద్ద బుద్ది లేదని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలు అంటున్నారు అప్పుడే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 52 రోజుల సమ్మెకు, ఆర్టీసీ నష్టాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటూ.. చార్జీలను పెంచుతూ ప్రజల దృష్టిని కేసీఆర్ మళ్లించారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో రోజుకు రూ. 2.98 కోట్ల అదనపు ఆదాయం రాగా...  సంవత్సరానికి వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఆయన వెల్లడించారు. పల్లె వెలుగు బస్సులకు 32 శాతం బస్ ఛార్జీలు పెంచుతున్నారని, 6 సంవత్సరాల నుండి ఆర్టీసీ నష్టాలకు సీఎం బాధ్యుడు కాదా అని ఆయన విమర్శించారు. ఇక ఆర్టీసీ కార్మికుల మరణాలకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని అన్నారు.

మిగతా రాష్ట్రాల్లో  డీజిల్ పెంపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయి కానీ తెలంగాణ ప​భుత్వం మాత్రం ఆర్టీసీపైనే భారం వేసిందని దుయ్యబట్టారు. నిన్నటి వరకు రూట్లు ప్రైవేట్ పర్మిట్ చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? ప్రతిపక్షాలు చెప్పాయా?..  ప్రైవేట్పరం చేస్తే ఆర్టీసీ తారీఫ్‌తో నడుపరని ముందే చెప్పారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేస్తుంది కదా.. ఏపీ ముఖ్యమంత్రి నీకంటే చిన్నవాడు. ఆయనకు అనుభవం తక్కువే అయినప్పటీకి అక్కడి కార్మికుల శ్రేయస్సు కోసం పని చేస్తుంటే తెలంగాణలో నువ్వు  ఎందుకు చేయవు’ అని ధ్వజమెత్తారు. అలాగే ఆర్టీసీ యూనియన్లు లేవని చెప్పడానికి నువ్వు ఎవరంటూ ఆయన ప్రశ్నించారు రు. అలాగే దసరా ముందే ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్కు పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కరం అయ్యేది కదా అని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రినని అనుకోకుండా.. ఓ రాజులా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక ఆర్టీసీ కార్మికులను తొలగిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గారని తెలిపారు. ఇక చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడం వారి హక్కు అని.. అయితే కేసీఆర్ ఏదో వారికి భిక్ష పెట్టినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం​ చేస్తున్నారు, ఉద్యోగ సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి, దానిపై సంఘాల నేతలు హక్కుల గురించి తేల్చుకోవాలని జీవన్‌ రెడ్డి సూచించారు. 

మరిన్ని వార్తలు