వరంగల్లో ప్రారంభించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్లో అత్యవసర కేసుల్ని వాదించేందుకు దేశంలోనే తొలిసారిగా వరంగల్లో మొబైల్ వీడియో కాన్ఫరెన్స్ వాహనాన్ని సోమవారం హైకోర్టు ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలో ఆ జిల్లా పోర్టుపోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు ఆన్లైన్లో ప్రారంభించారు.
వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలు లేని న్యాయవాదులు తమ కేసుల్ని వాదించేందుకు ఈ మొబైల్ వాహనం ఉపయోగపడుతుందని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారని, వరంగల్ నగరంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల్ని వాదించేందుకు వీలుపడుతుందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారిస్తున్న సంగతి తెలిసిందే.