భద్రాద్రి జిల్లాలో స్వల్ప భూకంపం 

6 Apr, 2020 03:17 IST|Sakshi

ఆందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం  

పాల్వంచ/ పాల్వంచ రూరల్‌/బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం మధ్యా హ్నం 12.30 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాల్వంచ మండలం రంగాపురం, జగన్నాథపురం, పాండురంగాపురం, లక్ష్మీదేవిపల్లి, కేశవాపురం, బస్వతారక కాలనీల్లో మూడు సెకండ్లపాడు, బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర, అంజనాపురం, పినపాక పట్టీనగర్‌ గ్రామాల్లో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం.. ఈ క్రమంలోనే భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఏం జరుగుతుందోననే ఆందోళనతో ఒక్కసారిగా పరుగులు తీశారు. అలాగే పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్‌ కాలనీలు, గట్టాయిగూడెం, బొల్లేరుగూడెం, కాంట్రాక్టర్స్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీ, సీతారాంపట్నం తదితర ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ప్రకంపనలకు ఇళ్లలో వంట సామగ్రి కిందపడినట్లు ప్రజలు చెబుతున్నారు. రిక్టర్‌ స్కేల్‌పై ఈ ప్రకంపనలు 2.6 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.   

మరిన్ని వార్తలు