రెవెన్యూ ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు

13 Dec, 2019 06:11 IST|Sakshi

భద్రాద్రి కొత్తగూడెం, అశ్వారావుపేటరూరల్‌: అశ్వారావుపేటకు చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేట రెవెన్యూ శాఖలో ఆర్‌ఐగా పని చేస్తున్న ఓ ఉద్యోగి స్థానిక ఫైర్‌ కాలనీలో కొంతకాలంగా అద్దెకు ఉంటున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు, వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధిత మహిళ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వారం రోజుల క్రితం లిఖిత పూర్వకంగా చేసింది.

అయినా కేసు నమోదు చేయడంలో పోలీసులు  తాత్సారం  చేయడంతో బాధిత కుటుంబీకులు ఓ మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ కూడా 100 కాల్‌ చేసి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదనే  ఆరోపణలు వస్తున్నాయి. భూ వ్యవహారంలో మాట వినలేదనే తనపై ఫిర్యాదు చేసినట్లు సదరు ఉద్యోగి, బాధిత మహిళపై ఫిర్యాదు చేశాడు. దీనిపై స్థానిక ఏఎస్సై ఎంవీ సత్యనారాయణను ‘సాక్షి’వివరణ కోరగా.. ఇరువర్గాల నుంచి పరస్పరం ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, ఇంకా కేసు నమోదు కాలేదని, దర్యాప్తులో ఉన్నట్లు చెప్పారు. 

>
మరిన్ని వార్తలు