ఎమ్మెల్యే తనయుడి ఖాతా నుంచి నగదు మాయం

14 Dec, 2014 02:56 IST|Sakshi

ఖమ్మం అర్బన్: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తనయుడు నరేన్ రాజు బ్యాంక్ ఖాతా నుంచి అతనికి తెలియకుండా 1.29లక్షల రూపాయలు మాయమైంది. అతని ఫిర్యాదుతో అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నరేన్ రాజుకు మమత ఆస్పత్రిలోగల ఆంధ్రా బ్యాంకులో ఖాతా ఉంది. ఇందులో నుంచి 1,29,173 రూపాయలు డ్రా అయినట్టుగా అతడు గుర్తించి శుక్రవారం అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన క్రెడిట్ కార్డుకు నకిలీది తయారుచేసి, దాని ద్వారా పై నగదును మూడు విడతలుగా మాయమైనట్టు పేర్కొన్నాడు. ఈ నెల 8న రూ.42వేలు, 9న రూ.42వేలు, 11న మిగిలిన మొత్తంతో ఎవరో ఆన్‌లైన్ షాపింగ్ చేసినట్టుగా తేలిందని తెలిపాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు