సైన్స్‌ టీచరే మా‘స్టార్‌’..

18 Oct, 2019 03:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మా‘స్టార్‌’ టీచర్‌ సైన్స్‌ ఉపాధ్యాయులే అని విద్యార్థులు చెబుతు న్నారు. హైదరాబాద్‌లో హైస్కూల్‌ స్థాయి విద్యార్థులపై నిర్వహించిన తాజా అధ్యయనంలో 30 శాతం మందికి సైన్సు మాస్టార్లంటేనే ఇష్టమని తెలపడం విశేషం. ఇక 48 శాతం విద్యార్థులకు టీచర్లు మంచి మిత్రులేనట. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు వారితో ఫ్రెండ్లీగానే వ్యవహరిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇక 26 శాతం మందికి లెక్కల టీచర్లు అంటేనే ఇష్టమట. ఇక తెలుగు, ఆంగ్లం, హిందీ తదితర భాషలు బోధించే పండితులంటే 13 శాతం మందికి ఇష్టమని తెలిసింది. చివరగా మరో 12 శాతం మందికి సోషల్‌ టీచర్లంటేనే ఇష్టమని బ్రెయిన్‌లీ సంస్థ నగరంలో చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది. నగరంలో సుమారు మూడువేల మంది హైస్కూల్‌ స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల అభిప్రాయాలు సేకరించగా వారి ఇష్టాఇష్టాలు, టీచర్లు–విద్యార్థుల మధ్యనున్న అనుబంధం వంటి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రస్తుత విద్యావిధానంలో టీచింగ్‌ మెథడాలజీ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు.. క్లాస్‌వర్క్‌లు.. హోంవర్క్‌ వంటి విషయాల్లో బోధన, గైడెన్స్‌ బాగానే ఉన్నట్లు తేలింది. అయితే లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలు, దైనందిన జీవితంలో చిన్నారులకు పనికివచ్చే అంశాలు, బహిరంగ ప్రదేశాలు, విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలియజెప్పే టీచర్లు కేవలం 24 శాతం మంది మాత్రమే ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించడం విశేషం. 

సందేహాల నివృత్తి ఇలా..
క్లాసులు జరుగుతున్న సమయంలో విద్యార్థులు అడిగే సందేహాలను విసుక్కోకుండా నివృత్తిచేసే ఉపాధ్యాయులు 48% మేర ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక రోజువారీగా తాము ఉపా ధ్యాయులను వివిధ అంశాలపై సందేహాలు అడుగు తున్నట్లు 37% విద్యార్థినీ విద్యార్థులు తెలిపారు. వారంలో కొన్నిసార్లు మాత్రమే తాము పలు అంశాలపై ఉపాధ్యాయులను సందేహాలు అడుగుతున్నామని మరో 29 శాతం మంది తెలిపారు. వారంలో కేవలం ఒకేసారి మాత్రమే తాము టీచర్లను డౌట్లు అడుగుతున్నట్లు 13 శాతం మంది విద్యార్థులు తెలపడం గమనార్హం. మొత్తంగా విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.

లోకజ్ఞానం నేర్పేవారు అరకొరే..
బండెడు పుస్తకాలు, క్లాస్‌వర్క్‌లు, హోమ్‌వర్క్‌లు, పరీక్షలు, మార్కులు సరేసరి కానీ.. విద్యార్థులకు లోకజ్ఞానం నేర్పే ఉపాధ్యాయులు కేవలం 24 శాతం మంది మాత్రమేనని ఈ సర్వే వెల్లడించడం గమనార్హం. సబ్జెక్టులను బోధించడంలో చూపుతున్న శ్రద్ధ.. విద్యార్థులకు దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి.. పరిసరాలను, ప్రకృతిని ఎలా పరిశీలించి విలువైన విషయాలను ఎలా గ్రహించాలి, ఇతరులతో, బహిరంగ ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలి అన్న అంశాలను నేర్పేవారి శాతం కేవలం 24 శాతమేనని తేలింది. రోజురోజుకు ఇలాంటి ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతుండడం పట్ల ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. 

30%సైన్స్‌ టీచర్లంటే మక్కువ చూపిన విద్యార్థులు..
26% లెక్కల మాస్టార్లంటే∙ఇష్టపడే వారు..
13% చిన్నారులకు భాషా పండితులంటే ప్రేమ
12%సోషల్‌ టీచర్లు అంటే అభిమానంహైదరాబాద్‌లో బ్రెయిన్‌లీ సంస్థ అధ్యయనం   

>
మరిన్ని వార్తలు