అగ్నిప్రమాదంలో తల్లీ కొడుకు మృతి

23 Jan, 2016 14:17 IST|Sakshi
గుండాల: తల్లీ, కుమారుడు ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పరశురాములు హైదరాబాద్‌లో మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి బండకొత్తపల్లిలో పౌల్ట్రీఫారం ఉంది. ఈ నేపథ్యంలో పరశురాములు తన భార్య కల్పన, కుమారుడు అభినందన్ (8)లను రెండు రోజుల క్రితం బండకొత్తపల్లికి పంపించాడు.
 
శుక్రవారం రాత్రి ఇంట్లో కరెంటు లేకపోవడంతో కల్పన పక్కనే ఉన్న అత్తింట్లో కొంత కిరోసిన్ తెచ్చుకుని వంట చేసుకుంది. రాత్రి సమయంలో వీరి ఇంటి నుంచి పొగలు రావడాన్ని కల్పన అత్త గమనించి స్థానికులకు తెలిపింది. వారొచ్చేసరికే కల్పన, అభినందన్ మంటల్లో చిక్కుకున్నారు. వారిని కాపాడి అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ తల్లీ, కుమారుడు మృతి చెందారు. అగ్ని ప్రమాదం వెనుకనున్న కారణాలు ఇంకా వెల్లడికాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు