భర్త వేధింపులు భరించలేక బావిలో దూకి..
మాక్లూర్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో భర్త వేధింపులు భరించలేక రెండేళ్ల కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గుత్ప గ్రామానికి చెందిన అన్నపూర్ణ (28)కు మాదాపూర్ గ్రామానికి చెందిన రంజిత్తో 2009లో వివాహం జరిగింది. వీరికి కుమార్తె నందిని, కొడుకు లక్కీ(2) ఉన్నారు. అన్నపూర్ణ మానిక్భండార్ గ్రామ ఆరోగ్య ఉప కేంద్రంలో రెండో ఏఎన్ఎంగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తోంది. కొన్నేళ్ల నుంచి భర్త రంజిత్ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. భర్త ప్రవర్తన నచ్చక అన్నపూర్ణ తల్లిగారింటికి ఇటీవలే వెళ్లిపోయింది. గ్రామ పెద్దలు నచ్చజెప్పి అన్నపూర్ణను తీసుకు వచ్చారు.
శుక్రవారం రాత్రి తాగి వచ్చిన రంజిత్ భార్యతో గొడవ పడి కొట్టాడు. భార్య వద్ద ఉన్న బ్యాంకు బుక్, డబ్బులు ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. భార్యకు ప్రతి నెల వేతనం రాగానే ఏటీఎం కార్డు తీసుకువెళ్లి డబ్బులు డ్రా చేసుకుని దుబారా ఖర్చు చేసేవాడు. ఎటో వెళ్లి ఆదివారం ఇంటికి వచ్చిన రంజిత్కు భార్య అన్నపూర్ణ, కొడుకు లక్కీ కనిపించకపోవడంతో అత్తామామలకు ఫోన్ చేసి చెప్పాడు. మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం బావివైపు వెళ్లిన స్థానికులకు దుర్వాసన రావడంతో బావిలోకి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. శనివారం ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి భర్త రంజిత్, అత్త లక్ష్మిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామునాయుడు తెలిపారు.