తెగుతున్న పేగు బంధాలు..!

7 Jul, 2017 14:19 IST|Sakshi
తెగుతున్న పేగు బంధాలు..!

వారు మద్యం మత్తులో కుటుంబసభ్యులను వేధించారు. భరించినన్ని రోజులు ఓపిక పట్టారు. వేధింపులు అంతకంతకూ పెరుగుతుండడంతో చివరికి తమవారినే హతమార్చారు. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు మూడు వేర్వేరు చోట్ల ముగ్గురు తమ వాళ్ల చేతుల్లో దారుణంగా హత్యకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లాలో తల్లి కొడుకును చెట్టుకు కట్టేసి చంపగా.. కామారెడ్డి జిల్లాలో తండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడో కొడుకు. వికారాబాద్‌ జిల్లాలో సంతలో అందరూ చూస్తుండగా కొడుకు తండ్రిని చంపేశాడు.


చెట్టుకు కట్టేసి.. కళ్లలో కారం చల్లి..
వేధిస్తున్న కొడుకును కడతేర్చిన తల్లి
సదాశివపేట రూరల్‌ (సంగారెడ్డి): నిత్యం వేధింపులు భరించలేక కన్న కొడుకునే కడతేర్చింది ఓ తల్లి. చెట్టుకు కట్టేసి.. కళ్లలో కారం చల్లి తీవ్రంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సదాశివపేట మండలం మద్దికుంట గ్రామానికి చెందిన సొన్నయీల శివాజీ (22) దురలవాట్లకు బానిసై జులాయిగా తిరిగేవాడు. గతంలో సెల్‌ఫోన్ల దొంగతనం కేసులో ఓసారి జైలుకు సైతం వెళ్లివచ్చాడు. అయినా బుద్ధి మారలేదు. తరచూ తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు.

తల్లి సుశీల ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినిపించుకునేవాడు కాదు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలంటూ ఐదు రోజులుగా తల్లిని వేధించసాగాడు. పైగా పెళ్లి చేయమంటూ అసభ్య పదజాలంతో దూషించేవాడు. రోజురోజుకూ వేధింపులు తీవ్రం కావడంతో విసిగిపోయిన తల్లి బుధవారం మధ్యాహ్నం కొడుకును మందలించింది. బయటికెళ్లి రాత్రికి తాగివచ్చిన శివాజీ మరోసారి తల్లితో గొడవపడ్డాడు. దీంతో ఆమె చిన్న కొడుకు విశ్వనాథం సహాయంతో ఇంటి ముందున్న వేప చెట్టుకు కట్టేసి, కళ్లలో కారం చల్లి ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఇద్దరూ కలసి గొంతు పిసకడంతో శివాజీ మృతి చెందాడు.   

అందరూ చూస్తుండగానే తండ్రి హత్య
కుటుంబ కలహాలే కారణం

కొడంగల్‌ రూరల్‌: సంతలో అందరూ చూస్తుండగానే తండ్రిని దారుణంగా హత్య చేశాడో తనయుడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  కొడంగల్‌ మండలం అంగడి రాయిచూర్‌కి చెందిన నయీమ్‌ (70)కు ముగ్గురు కొడుకులు. వీరి కుటుం బం ఎండు మిరపకాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. గురువారం రావులపల్లి సంతకు నయీమ్‌ మిరపకాయలు తీసుకొని వచ్చాడు. అంతకుముందే వారి ఇంట్లో కుటుంబ విషయమై గొడవ జరిగింది. దీంతో నయీమ్‌ రెండో కొడుకు హాజిద్‌ తండ్రిని చంపాలని సంతకు వచ్చాడు. సంతలో అందరూ చూస్తుండగానే తండ్రి కడుపు లో కత్తితో పొడిచి చంపి పారిపోయాడు.  

తండ్రిని చంపిన కొడుకు
కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని..

వర్ని(బాన్సువాడ): తాగి వచ్చి తరుచూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడనే ఆగ్రహంతో కొడుకు కన్న తండ్రిని దారుణంగా హతమార్చిన ఘటన బుధవారం రాత్రి నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం జాకోరాలో జరిగింది. బాన్సువాడ మండలం సోమేశ్వర్‌ గ్రామానికి చెందిన కిష్టయ్య(51) వర్ని మండలం జాకోరాలోని మేన మరదలు మార్ప సత్తెవ్వ ఇంటికి సుమారు 30 ఏళ్ల క్రితం ఇల్లరికం వచ్చాడు. వీరికి ఇద్దరు కుమారులు. కిష్టయ్య పనిచేయకుండా నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యులను వేధించేవాడు. పదేళ్ల నుంచి కిష్టయ్య బంధువుల ఇంటి వద్ద ఉంటూ అప్పుడప్పుడూ జాకోరా వచ్చి వెళ్లేవాడు. జాకోరాకు వచ్చిన ప్రతిసారి ఆస్తి తనదని, కౌలు డబ్బులు తనకే ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు.

తనను ఇంటికి రానివ్వడం లేదని భార్యను అనుమానిం చేవాడు. బుధవారం రాత్రి తాగిన మైకంలో జాకోరా వచ్చిన కిష్టయ్య భార్య సత్తెవ్వతో గొడవపడ్డాడు. అడ్డు వచ్చిన కోడలు గంగామణిని దూషించాడు. పొలం అమ్మేస్తాను. ఎవరు అడ్డువస్తారో చూస్తా అంటూ బెదిరించి వెళ్లిపోయాడు. కొద్ది సేపటికి పెద్దకొడుకు దత్తు ఇంటికి రావడంతో తల్లి సత్తెవ్వ జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో ఆగ్రహంతో దత్తు కమ్మ కత్తి తీసుకుని తండ్రి కోసం గాలించాడు. గ్రామంలోని బస్టాండ్‌లో దిమ్మెపై నిద్రిస్తున్న తండ్రి తల, మెడపై కత్తితో వేటు వేయడంతో కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే సైకిల్‌పై వర్ని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దత్తు లొంగిపోయాడు.

మరిన్ని వార్తలు