కని‘పారేశారు..’

21 May, 2016 10:39 IST|Sakshi
మృత శిశువును పరిశీలిస్తున్న పోలీసులు

* ముళ్లపొదల్లో నవజాత శిశువు
* సింగారెడ్డిపాలెంలో ఘటన

పెన్‌పహాడ్: అప్పుడే పుట్టిన పండంటి బాబును ఓ తల్లి వదిలేసింది.. పాల కోసం ఏడ్చిఏడ్చీ ఆ పసిగుడ్డు ప్రాణాలు వదిలాడు.. ఈ హృదయ విదారక ఘటన మండలంలోని సింగారెడ్డిపాలెం గ్రామ దళిత కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల  ప్రకారం... గ్రామంలోని దళిత కాలనీ వీధి గోడ మీద అప్పుడే ప్రసవించిన మగ శిశువును గుర్తు తెలియని తల్లి సంచిలో వేసి వదిలి వెళ్లింది.

ఆ శిశువు సంచిలో ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు గోడ మీద ఉన్న సంచిని గమనించగా అందులో శిశువు ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై వాడపల్లి జానయ్య అక్కడికి చేరుకుని శివును పరిశీలించారు. ఎవరో మోసపోయిన యువతి పుట్టిన బిడ్డను వదిలివేసి ఉన్నట్లు పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుల నుంచి సమాచారాన్ని సేకరించనున్నట్లు ఎస్సై తెలిపారు. మహిళ ప్రసవానికి సహకరించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వీఆర్వో నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట హెడ్‌కానిస్టేబుల్స్ వెంకన్న, రాములు, కానిస్టేబుల్ యాదగిరి ఉన్నారు.

మరిన్ని వార్తలు