మోత్కుపల్లి శంఖారావం.. ఇండిపెండెంట్‌గా పోటీ

26 Sep, 2018 13:28 IST|Sakshi
మోత్కుపల్లి నరసింహులు (ఫైల్‌ ఫోటో)

ఆలేరు అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ

రేపు  ‘మోత్కూపల్లి శంఖారావం’తో ప్రచారం ప్రారంభం

సాక్షి, యదాద్రి : టీడీపీ బహిష్కిృత నేత మోత్కుపల్లి నరసింహులు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువనున్నారు. తన సొంత నియోజకవర్గమైన ఆలేరు స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆలేరు ప్రజల అభీష్టం మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని ఆయన తేల్చిచెప్పారు.  ఈ మేరకు రేపు యాదగిరిగుట్టలో ‘‘మోత్కుపల్లి శంఖరావం’’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సభ ఏర్పాట్లను తన మద్దతుదారులతో కలిసి బుధవారం పరిశీలించారు.

కాగా టీడీపీలో సీనియర్‌నేతగా, మంత్రిగా వ్యవహిరించిన మోత్కుపల్లి చంద్రబాబు వ్యవహారంతో విభేదించి ఆయనపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీకి రాజీనామా అనంతరం వివిధ పార్టీల్లో ఆయన చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య జనసేనాలో చేరుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.  గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మోత్కుపల్లి కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్క చేతిలో ఓటమి పాలైయ్యారు. టీడీపీ కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న సమయంలో కేంద్రంలో చంద్రబాబు సహాకారంతో ఏదోఒక పదవి వస్తుందని ఆశించిన మోత్కుపల్లి... చివరికి చంద్రబాబు హ్యాండ్‌ ఇవ్వడంతో తీవ్ర మనస్థాపం చెందారు.

మరిన్ని వార్తలు