మోత్కుపల్లి శంఖారావం

27 Sep, 2018 08:24 IST|Sakshi
గుట్టలో అనుచరులతో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మోత్కుపల్లి నర్సింహులు

సాక్షి, యాదాద్రి : జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘట్టానికి నేడు తెరలేవబోతోంది. ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై, మంత్రిగా పని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ని లిచేందుకు సన్నద్ధం అవుతున్నాడు. అందులో భాగంగా ‘మోత్కుపల్లి శంఖారావం’ పేరుతో గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని పాత హైస్కూల్‌ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తుండడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించడమే ప్రధాన ఎజెండాగా మోత్కుపల్లి నిర్వహించనున్న బహిరంగసభను అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
 
యాదాద్రీశుడి చెంతనుంచి ఎన్నికల నగారా
ఎన్నికల ముందు భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా నియోజకవర్గంలో తన సత్తా చాటాలనే పట్టుదలతో మోత్కుపల్లి ఉన్నారు. శాసనసభకు జరగనున్న ముందస్తు ఎన్నికల బరిలో తాను ఉం టానని ఇప్పటికే మోత్కుపల్లి ప్రకటించారు. యాదాద్రీశుడి చెంతనుంచి ఎన్నికల నగారా మోగించబోతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మోత్కుపల్లి.. శంఖారావం సభతో సత్తా చాటా లని సంకల్పంతో ఉన్నారు. 10వేల మందితో సభ సక్సెస్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు.
 
ప్రజలతో మమేకం..
రాజ్యసభ, గవర్నర్‌ పదవుల పేరుతో టీడీపీ అధి నేత  చంద్రబాబునాయుడు తనను మోసం చేశాడని ఆయనపై తిరుగుబాటు జెండాను ఎగురవేసి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించాలన్న తపనతో ఉన్నారు. ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, మరోమారు ఎమ్మెల్యేగా గెలిపిస్తారన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, ఇవే నా చివరి ఎన్నికలని మోత్కుపల్లి కొంత కాలంగా నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటిస్తూ ప్రజలను  కలుస్తున్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు, తుంగతుర్తి నుంచి ఒక దఫా మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను మరోసారి ఆలేరు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తారన్న ధీమాతో మోత్కుపల్లి ఉన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు కోరుతున్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసిన ఆలేరు ప్రజలు తనను ఐదు సార్లు గతంలో ఆశీర్వదించారని మరో మారు ఆశీర్వదించే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.

గ్రామగ్రామాన పర్యటనలు
నెల రోజులుగా ఆలేరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మోత్కుపల్లి పర్యటిస్తున్నారు. తపాస్‌పల్లి జలాలు ఆలేరు నియోజకవర్గానికి అందించా లని టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర, ఆ లేరు పట్టణంలో మూసిన  రైల్వేగేట్‌ తెరిపించడంలో తాను చేసిన పోరాటం, యాదాద్రి జిల్లా ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు,మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధిలో తన పాత్రను వివిరిస్తున్నాడు. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇందుకోసం గుట్టలో నేడు నిర్వహించే శం ఖారావం సభద్వారా  ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానన్న సంకేతాలు పంపనున్నారు.

చంద్రబాబునాయుడు మోసం చేశాడు
చంద్రబాబునాయడు నన్ను అన్ని విధాలుగా మోసం చేశాడు.  రాజకీయంగా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. కానీ, ఆలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఇండిపెండెట్‌గా గెలిపించుకుంటా మని  ప్రతిజ్ఞ చేస్తున్నారు. రాజ్యసభ, గవర్నర్‌ ఇవ్వాలని ఏనాడూ ఏ నాయకుడిని నేను వేడుకోలేదంటున్నాడు మోత్కుపల్లి. ఆ రెండు పదవుల్లో ఏ పదవి వచ్చినా ఆలేరు, భువనగిరి ప్రాంతా లను బ్రహ్మాండగా అభివృద్ధి జరిగేది.  ఆలేరు అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చేయాలని వేలాది మంది తరలివచ్చి  గుట్టలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి. గోదావరి జలాల సాధనే నా జీవితాశయం.

మరిన్ని వార్తలు