ఫలించిన కల!

17 Mar, 2016 02:00 IST|Sakshi

ఉద్యమాలు, ధర్నాలకుదక్కిన ప్రతిఫలం
ఎంతోమంది విద్యార్థులకు లబ్ధి

 
 పాలమూరు యూనివర్సిటీ : పాలమూరు యూనివర్సిటీ (పీయూ)కు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీ నుంచి యూనివర్సిటీకి లేఖ పంపారు. ఇక నుంచి దేశంలో ఉన్న అతి ముఖ్యమైన యూనివర్సిటీల సరసన పీయూ నిలవనుంది.  దీంతో పాటు ఇక్కడ చదివిన వి ద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉండనుంది. పీసీఐ గు ర్తింపు వచ్చినట్లు లేక రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పీసీఐ గుర్తింపు కోసం పీయూ విద్యార్థులు ఏడేళ్ల కాలం నుంచి రోజుల తరబడి ఎన్నో ఉద్యమాలు.. పరీక్షల బహిష్కరణ..ధర్నాలు.. రాస్తారోకోలు చేశారు. దీంతో వాటికి ప్రతిఫలం దక్కింది. పాలమూరు యూనివర్సిటీ 2008 ఆగస్టులో ప్రారంభం కాగా, ఇందులో ఫార్మసీ కళాశాల 2009లో ఏర్పాటు చేశారు. కళాశాల ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లు చదువు పూర్తి చేసుకున్నా బయటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ నడుస్తోంది.

 పీసీఐ అంటే..
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)ని పార్లమెట్ నామినేట్ చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తుంది. దీనిని 1948లో ప్రారంభించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఫార్మసీ విద్య ఎలా కొనసాగుతుందో అనే విషయాన్ని పరిశీలన చేయడం పీసీఐ బాధ్యత. పీసీఐ గుర్తింపు లేని యూనివర్సిటీలను సందర్శించి అక్కడ కనీస సౌకర్యాలు ఉన్నాయా.. పీసీఐ గుర్తింపు ఇవ్వడానికి ఆ విశ్వవిద్యాలయానికి అర్హత ఉందో లేదో పరిశీలన చేస్తారు. అర్హత ఉంటే ఆ యూనివర్సిటీకి గుర్తింపు ఇస్తారు. గుర్తింపు ఇవ్వడం వల్ల యూనివర్సిటీ ఖ్యాతి పెరగడంతో పాటు అక్కడ చదువుకునే విద్యార్థులకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి.

పీసీఐ వల్లే విద్యార్థులకు జరిగే మేలు..
పీసీఐ గుర్తింపు రావడం వల్ల స్థానికంగా చదువుకునే విద్యార్థులు ఎంతో మేలు చేకూరనుంది.. చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్టు ఉద్యోగ అవకాశం, డ్రగ్గిస్ట్ ఉద్యోగాలు, రైల్వే ఫార్మసిస్ట్, మిలిటరి ఫార్మసిస్టు, స్వతహాగా మెడికల్ దుకాణం పెట్టుకోవడానికి అవకాశం ఇలా ప్రతి ఉద్యోగానికి పీసీఐ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్ చాలా ఉపయోగంగా ఉంటుంది. పీసీఐ గుర్తింపు లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ఉద్యోగానికీ వారు అర్హులు కాదు. మార్కెట్‌లో ఉన్న పెద్ద పెద్ద పరిశ్రమలలో పీసీఐ గుర్తింపు ఉన్న కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.

పీయూను రెండుసార్లు సందర్శించిన పీసీఐ
పాలమూరు యూనివర్సిటీని పీసీఐ బృందం 2014 జనవరిలో మొదటిసారి పరిశీలించింది. ఇద్దరు సభ్యుల బృందం.. ఫార్మసీ కళాశాల, హాస్టల్, ఫార్మసీ ల్యాబ్‌లు, ఇతర సౌకర్యాలపై పరిశీలన చేసి వెళ్లింది. అప్పుడు పీసీఐ గుర్తింపు ఇవ్వాల్సిన సౌకర్యాలు స్థానికంగా లేవని నివేదిక ఇవ్వడంతో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 2015 డిసెంబర్‌లో మరోమారు ఇద్దరు సభ్యుల బృందం సందర్శించింది. సభ్యులు స్థానిక సౌకర్యాలపై కొంతవరకు తృప్తి చెంది వెళ్లారు. పీయూ నుంచి పీసీఐ గుర్తింపు కోసం అవసరం అయిన పత్రాలు పంపించడంతో దాదాపు మూడు నెలల తర్వాత గుర్తింపు ఇస్తూ లేఖ పంపించారు.

ఫార్మసీలో 4వ బ్యాచ్ రన్నింగ్..
పీయూలో ఫార్మసీ కళాశాల 2009లో ఏర్పాటు చేశారు. మూడు బ్యాచ్‌లలో 180మంది విద్యార్థులు విద్యను పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఫార్మసీలో 4వ బ్యాచ్ నడుస్తుంది. ఆ విద్యారుల్థ చదువు కూడా మేలో ముగుస్తుంది. దీంతో పీసీఐ వల్ల వెళ్లిపోయిన 180మందితో పాటు ప్రస్తుతం చదువుకుంటున్న 60మందికి కూడా పీసీఐ గుర్తింపు దక్కనుంది.

మరిన్ని వార్తలు