బీమాను సద్వినియోగం చేసుకోవాలి

19 Feb, 2018 15:25 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌

చండూరు (మునుగోడు) : లక్ష్మీనర్సింహస్వామి వృత్తిదారుల బీమా పథకాన్ని ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్‌ కోరారు. ఆదివారం చండూరు రహదారి బంగ్లాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని తనకు ఆలోచన వచ్చిందన్నారు. కార్మికుల నుంచి పథకానికి అనూహ్య స్పందన వస్తోందన్నారు. మొదటగా భువనగిరి పార్లమెంట్‌ స్థాయిలో బీమా పథకం ప్రవేశపెట్టానని, అనంతరం ఉమ్మడి జిల్లా నుంచి అనేకమంది ఫోన్ల ద్వారా కోరుతుండడంతో ప్రస్తుతం అంతటా బీమా పథకాన్ని విస్తరించామన్నారు.

మార్చి 01 తేదీ నుంచి బీమా అమల్లోకి వస్తుందన్నారు. కార్మికులు ఫిబ్రవరి చివరి వరకు అన్ని వివరాలు అందించాలన్నారు. బీమా చేసిన కార్మికులకు ఐడీ కార్డులు అందిస్తామని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రానున్న కాలంలో తెలంగాణ ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. ఆయన వెంట ఎంపీపీ తోకల వెంకన్న, గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వడ్డెపల్లి గోపాల్‌గౌడ్, తిరందాసు ఆంజనేయులు, సురేష్, కొత్త గంగాధర్, తదితరులు ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు