సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కాంగ్రెస్ నేత మధుయాష్కీ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ పరపతి దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నారని, తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తనపై భర్తపై ఆధారాలు లేని అవాస్తవాలు, ఆరోపణలు చేయడం విచారకరమని అన్నారు. తన పట్ల, తన భర్త పట్ల వాడిన అసభ్య పదజాలాన్ని వాపస్ తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కవిత హెచ్చరించారు.