గ్రీన్‌చాలెంజ్‌ @ 2 కోట్లు 

19 Aug, 2019 02:23 IST|Sakshi

మరోసారి మొక్క నాటి సెల్ఫీ దిగిన ఎంపీ సంతోష్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘హరా హై తో భరా హై’(పచ్చగా ఉంటే నిండుగా ఉంటుంది) అంటూ గతేడాది మొదలైన గ్రీన్‌ చాలెంజ్‌ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్క నాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ దీనిని ప్రారంభించారు. తాను స్వయంగా మొక్క నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్‌ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్‌ చేశారు. వారం దరూ కూడా మొక్కలు నాటారు. ఇలా ఏడాది పాటు ఈ కార్యక్రమం కొనసాగింది.

ప్రముఖులతోపాటు సామాన్యులూ ఇందులో భాగస్వామ్యులయ్యారు. మొక్కలు నాటి, సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మధ్యలో లక్ష్యం ఒక కోటికి చేరినప్పుడు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మొక్కను నాటారు. ఈ లక్ష్యం ఆదివారం నాటికి రెండు కోట్లకు చేరటంతో మరోసారి ఎంపీ సంతోష్‌ మొక్క నాటారు. గతేడాది తాను నాటిన మొక్క ఏపుగా పెరగటంతో మరోసారి దానితో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కార్యక్రమంలో ఇగ్నయిటెడ్‌ మైండ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతి నిధులు కరుణాకర్‌రెడ్డి, రాఘవ పాల్గొన్నారు.  

మరో నలుగురికి గ్రీన్‌ చాలెంజ్‌ 
మరో నలుగురు ప్రముఖులకు ఎంపీ సంతోష్‌ గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సినీనటుడు అఖిల్‌ అక్కినేని, జీఎమ్మార్‌ అధినేత మల్లికార్జున్‌రావులను మొక్కలు నాటాల్సిందిగా కోరారు. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఇగ్నయిటెడ్‌ మైండ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ గ్రీన్‌ చాలెంజ్‌ను చేపట్టింది.  

మరిన్ని వార్తలు