నిట్‌లో ఎంటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

20 Jun, 2018 02:24 IST|Sakshi

కాజీపేట అర్బన్‌: వరంగల్‌లోని నిట్‌లో ఎంటెక్‌ తొలి ఏడాది విద్యార్థి అమిత్‌కుమార్‌ (31)మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్‌ రాష్ట్రంలోని నవాడాకు చెందిన శంకర్‌ ప్రసాద్, లలితాదేవి దంపతుల కుమారుడు అమిత్‌ నిట్‌లో ఎంటెక్‌ ట్రిపుల్‌ఈ విభాగంలో ‘పవర్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌’ కోర్సు చదువుతున్నాడు. నిట్‌లోని 1.8కే అల్ట్రామెగా హాస్టల్‌లోని ఏ8–27 గదిలో ఉంటున్న అమిత్‌.. రోజూ తండ్రితో ఫోన్‌లో మాట్లాడేవాడు.

2 రోజులుగా ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో తండ్రి శంకర్‌ప్రసాద్‌.. అమిత్‌మిత్రుడు రాహుల్‌కు ఫోన్‌ చేసి తన కొడుకుతో మాట్లాడించమని అడిగాడు. అమిత్‌ను కలిసేందుకు వెళ్లిన అతడి మిత్రులు హాస్టల్‌ గదిలో అమిత్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటం గమనించారు. వెంటనే వారు నిట్‌ యాజమాన్యం, కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఇటీవల పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడం, స్టైఫండ్‌ ఆగిపోవడంతో మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు