ఉత్కంఠ వీడేనా?

14 Aug, 2019 13:08 IST|Sakshi
దుబ్బాక మున్సిపల్‌ కార్యాలయం

నేడు పురపోరుపై హైకోర్టు తీర్పు దుబ్బాక, గజ్వేల్‌

ఎన్నికలపై స్టే తొలిగేనా?

ఆసక్తిగా గమనిస్తున్న ఆశావహులు

కోర్టు తీర్పుపై టెన్షన్‌...టెన్షన్‌..పురపాలక ఎన్నికల చిక్కుముడి వీడటం లేదు. హై కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. తాజాగా సోమవారం జరగాల్సిన విచారణ మరోసారి మంగళవారానికి వాయిదా పడింది. ఆశావహుల్లో రోజురోజుకూ టెన్షన్‌ పెరిగిపోతోంది. పలు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలంటూ కోర్టుకు వెళ్లడంతో పురపోరుకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించాలని ఓటరు జాబితా, వార్డుల విభజన సరి చేశామంటూ ప్రభుత్వం తరఫున నివేదికను  ఈ నెల 9వ తేదీన కోర్టుకు అందజేశారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

సాక్షి, దుబ్బాక: మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన మార్పులు చేశామని ప్రభుత్వం కోర్టుకు నివేదించడంతో తుది తీర్పునను ఈ నెల 13 తేదీకి వాయిదా వేశారు. మళ్లీ 13న విచారణ జరగకుండానే నేటికి వాయిదా పడింది.  జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్‌ మున్సిపాల్టిల్లో  ఓటరు జాబితాతో తప్పుల తడకగా ఉన్నాయని, చనిపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండడం, వార్డుల విభజన సక్రమంగా జరుగలేదంటూ పలు కారణాలతో పలువురు హై కోర్టును ఆశ్రయించడంతో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల పై స్టే విధించింది.  ప్రభుత్వం అందజేసిన నివేదికతోనైనా దుబ్బాక, గజ్వేల్‌ మున్సిపోల్స్‌కి లైన్‌ క్లియర్‌ అయ్యేనా..? అని ఎదరుచూస్తున్నారు. జులై నెలలలోనే  ఎన్నికల నోటిఫికేషన్‌ రావాల్సి ఉండగా ఆగస్టు వచ్చినా ఆ నోటిఫికేషన్‌ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మున్సిపల్‌ ఎన్నికలపై నేడు హై కోర్టు తీర్పు రాజకీయ వర్గాల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది.

ఎదురు చూపులకు తెరపడేనా...
మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టు  తీర్పు వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు ఎన్నికలపై విచారణను కోర్టు వాయిదా వేయడం 6 వ తేదీన జరుగాల్సిన వాదనలు 9వ తేదీకి  మళ్లీ  13కు చివరగా నిన్న మళ్లీ 14 వ తేదీ(నేటికి) వాయిదా వేయడం జరిగింది. దీంతో మళ్లీ ఈ రోజైనా కోర్టు తీర్పు స్పష్టం అవుతుందో..? లేక మళ్లీ వాయిదా పడుతుందో? తెలియని అయోమయం నెలకొంది. ఇప్పటికే పలు పర్యాయాలు ఎన్నికలపై తీర్పు వస్తుందని ఎదురుచూసి వేసారిపోయిన రాజకీయ పార్టీల నాయకులు, ఆశవాహులు నేడు ఖచ్చితంగా తీర్పు వెలువడతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

అందరిలోను కోర్టు తీర్పుపై  టెన్షన్‌...టెన్షన్‌...
మున్సిపల్‌ ఎన్నికలపై నేడు హై కోర్టులో తీర్పు వెలువడే అవకాశాలు ఉండడంతో రాజకీయ పార్టీల నాయకుల్లో..పోటీ చేసే ఆలోచనలో ఉన్న ఆశవాహుల్లో కోర్టు తీర్పుపై టెన్షన్‌ నెలకొంది.వరుస వాయిదాలు పడుతు రావడం ఇటీవలనే ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికల్లో ఏలాంటి తప్పులు లేకుండా సరిచేసిన నివేదికలు కోర్టుకు సమర్పించడంతో నేడు ఖచ్చితంగా తీర్పు వెలువడుతుందనే ఆశిస్తున్నారు.ఎక్కడ చూసిన మున్సిపల్‌ ఎన్నికల తీర్పుపైననే జోరుగా చర్చలు జరుగుతుండడం కనిపిస్తుంది. అలాగే నేటి తీర్పు దుబ్బాక, గజ్వేల్‌ మున్సిపాలిటీల ఎన్నికలకు క్లియరెన్స్‌ వస్తుందనే టాక్‌ వినిపిస్తుంది.

ధీమాలో ఆశావహులు...
కోర్టు తీర్పు ఎన్నికలకు అనుకూలంగా వస్తుందన్న ధీమాతో రాజకీయపార్టీల నాయకులు, ఆశావహులు ఉన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికల కోసం వార్డుల పునర్విభజన, ఓటర్ల గణన, కుల ఓటర్ల గుర్తింపు, పోలింగ్‌ కేంద్రాల నిర్దారణ, పోలింగ్‌ సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణను ఇచ్చారు. కేవలం వార్డుల, చైర్మన్ల రిజర్వేషన్ల అంశం మాత్రమే తేలాల్సి ఉంది. జులై చివరి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని అధికారులతో పాటు రాజకీయ నాయకులు ఊహించారు. ఈ క్రమంలోనే పలువురు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు హడావుడి ఎన్నికలు ఎందుకు అంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.  ఏదేమైనా నేడు హై కోర్టు తీర్పు ఏం వస్తుంద అన్న టెన్షన్‌ తో చాల మంది ఆశావహులు నిద్రకూడ సక్రమంగా పోని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి లేదు. మున్సిపల్‌ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయా..? మళ్లీ వాయిదా పడుతాయా? అన్న విషయం నేడు స్పష్టం కానుంది. 

మరిన్ని వార్తలు