యాదాద్రికి మాస్టర్‌ ప్లాన్‌!

26 Sep, 2019 05:33 IST|Sakshi

25,817 ఎకరాల్లో బృహత్తర ప్రణాళిక

ప్రభుత్వ ఆమోదానికి పంపిన పురపాలక శాఖ

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి అభివృద్ధికి పుర పాలక శాఖ బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రగతికి పెద్దపీట వేస్తోంది. తెలంగాణ తిరుమలగా తీర్చిదిద్దడానికి యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) పరిధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ రూపొందించింది. 25,817 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన మాస్టర్‌ ప్లాన్‌ను ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఆలయ నిర్మాణం మొదలు, పునుల పురోగతి తదితర పనులను తరచూ సమీక్షిస్తున్న కేసీఆర్‌ ఆలోచనలకు తగ్గట్లు మున్సిపల్‌ శాఖ మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేసింది. యాదాద్రి దేవాలయ ఆధునిక పనులు పూర్తయితే భక్తుల తాకిడి పెరుగుతుందని అంచనా వేసిన పురపాలక శాఖ.. దానికి అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌లో రెసిడెన్షియల్, వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యమిచి్చంది.  

పట్టణీకరణకు సగం..
మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి వస్తే యాదాద్రిలో వ్యవ సాయం కనుమరుగు కానుంది. ప్రస్తుతం 9,944.45 (38.52%) ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములుండగా.. మాస్టర్‌ ప్లాన్‌లో దీన్ని 3,339.5 (13.14%) ఎకరాల మేర పొందుపరిచారు. పట్టణీకరణకు 11,310.85 (43.81%) ఎకరాలు నిర్దేశించారు. యాదగిరిగుట్టలో కొండ లు, గుట్టలు కరిగిపోనున్నాయి. గతంలో కొండ లు, గుట్టలు, 3,667.23 (14.22%)ఎకరాల్లో ఉండగా.. మాస్టర్‌ప్లాన్‌లో 2,423.6 (9.39%) ఎకరాలకు పరిమితం చేసింది.

వాణిజ్య అవసరాలకు పెద్దపీట
యాదాద్రికి వచ్చే భక్తుల అవసరాలకు సరిపడా మౌలిక సౌకర్యాలు కలి్పంచాలనే ఉద్దేశంతో మాస్టర్‌ప్లాన్‌లో 2,557.25 ఎకరాలను రెసిడెన్షియల్, 242.28 ఎకరాల మేర కమర్షియల్‌ జోన్‌కు నిర్దేశించింది. ప్రస్తుతం కమర్షియల్‌ జోన్‌ 43.63 ఎకరాల్లోనే ఉంది. ఇప్పటికే స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాంతానికి 1,698 ఎకరాలు కేటాయించింది. ఇలా వివిధ అవసరాలకు జోన్లను నిర్దేశించిన పురపాలక శాఖ.. డ్రాఫ్ట్‌ మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వానికి పంపింది. దీనికి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే.. మాస్టర్‌ప్లాన్‌ కార్యరూపం దాల్చనుంది.

మరిన్ని వార్తలు