‘ఒకే దేశం ఒకే జెండా బీజేపీ నినాదం’

25 Sep, 2019 01:54 IST|Sakshi

ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనేదే బీజేపీ లక్ష్యం అని ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. దీనిలో భాగంగానే దేశంలో ఒకే రాజ్యాంగం అమల్లోకి తీసుకువచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. మంగళవారం సిద్దిపేటలో నేషనల్‌ యూనిటీ క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహించిన జన జాగారణం సమావేశంలో ఆర్టికల్‌ 370, 35(ఏ) రద్దుపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళీధర్‌రావు హాజరై మాట్లాడారు.

ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం చరిత్రాత్మకమైందని, దీనివల్ల 70 ఏళ్లుగా కశ్మీర్‌లో ఉన్న ఆంక్షాలను మోదీ ఒక్క నిర్ణయంతో రద్దు చేశారన్నారు. ఈ ఆర్టికల్‌ వల్ల కశ్మీర్‌లోని మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు, లదాఖ్‌లు రిజర్వేషన్లు పొందలేకపోయారని, మహిళలు తమ ఆస్తి హక్కు, ఓటు హక్కును కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. నెహ్రూ దేశ భక్తుడే, స్వాతంత్రం కోసం పోరాడిన నాయకుడే కానీ, దేశ విభజనకు ముఖ్య కారణం ఆయనే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు