కాంగ్రెస్ నాయకుడి హత్యకు పన్నాగం

6 May, 2015 00:30 IST|Sakshi

కాంగ్రెస్ నాయకుడి  హత్యకు పన్నాగం
హత్య చేసేందుకు వెళ్తూ వాహనాల తనిఖీలో  పోలీసులకు చిక్కిన వైనం

 
నాగార్జునసాగర్ : కాంగ్రెస్ నాయకుడిని హతమార్చేందుకు వెళ్తున్న ఓ హంతక ముఠా పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దక్షిణవిజయపురి పోలీస్టేషన్ పరిధిలోని  పెద్దవూర మండలం తిమ్మాయిపాలెం తం డాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమావత్ శౌరినాయక్‌కు అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మూడావత్‌రామారావు, దేపావత్‌బుజ్జి, బానావత్ స్వామినాయక్, చంగునాయక్, పాండునాయక్‌కు రాజకీయ కక్షలు ఉన్నాయి.

రమావత్ శౌరి గత ఎన్నికల్లో తన సోదరుడు రమావత్ లకుపతిని పోటీచేయిం చి ఎంపీటీసీగా గెలిపించాడు. అయితే శౌరి బతికిఉంటే రాజకీయంగా తాము ఎదుగలేమని ఆ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు శౌరిని హత్య చేయించేందుకు రెండేళ్ల క్రితం ఒకహంతక మూఠాతో రూ.5 లక్షలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.

పోలీసులను చూసి..
రెండు రోజుల క్రితం హంతక ముఠా కారులో తిమ్మాయిపాలెం బయలు దేరింది. జిల్లా కేంద్రం శివారులోనే వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి కారులో ఉన్న ముఠా సభ్యులు పరుగు తీశారు. వారిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఠాలో తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో టీడీపీ కార్యకర్తలు మూడావత్‌రామారావు,దేపావత్‌బుజ్జి,బానావత్ స్వామినాయక్, చంగునాయక్, పాండునాయక్‌ను మంగళవారం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ కుట్రలో హాలియాకు చెందిన ఓ దిన్నపత్రిక విలేకరి భాగస్వామ్యం కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే ఇప్పటికే పోలీసులు వీరందరినీ విచారిస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు