12న చైతన్య సదస్సు
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ కార్యక్రమాలపై నగరవాసుల్లో చైతన్యం కల్పించేందుకు జిమ్ నిర్వాహకులు, ప్రాక్టీషనర్లతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ‘మై ఫిట్నెస్ – సిటీ ఫిట్నెస్’ పేరుతో చైతన్య సదస్సు, 5కే రన్ నిర్వహించనున్నట్లు కమిషనర్ దానకిశోర్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12న ఉదయం 6గంటలకు ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని పార్టీ జోన్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు, ప్రముఖ క్రీడాకారులు పాల్గొంటారన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 700 పైగా మోడ్రన్ జిమ్లున్నాయి. వీటితో పాటు పదుల సంఖ్యలో సంప్రదాయ హనుమాన్ వ్యాయామశాలలు ఉన్నాయి. తమ ఆరోగ్య పరిరక్షణ కోసం వీటిల్లో వ్యాయామం చేయడానికి ప్రతిరోజు కనీసం లక్ష మంది వెళ్తుంటారు. వీరంతా కూడా తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగానే నగర స్వచ్ఛతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ కోరారు. చైతన్య సదస్సులో జిమ్ నిర్వాహకులు, ప్రాక్టీషనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.