తెలంగాణకూ నాబార్డు

3 Apr, 2015 00:45 IST|Sakshi
తెలంగాణకూ నాబార్డు
  • రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా కార్యకలాపాలు
  • సీజీఎంగా సత్యనారాయణ
  • సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించిన జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ప్రాంతీయ కార్యాలయాన్ని గురువారం విభజించి తెలంగాణ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక నుంచి రెండు రాష్ట్రాల్లో నాబార్డు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహించనుంది. తెలంగాణ నాబార్డుకు చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా వి.వి. సత్యనారాయణను నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీజీఎంగా పనిచేసిన జీజీ మెమ్మేన్ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. మరికొద్ది రోజుల్లో ఉద్యోగులను విభజించనున్నారు. నాబార్డు జాతీయ బ్యాంకు అయినందున ఆస్తుల పంపకం అనేది ఉండదు. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యాల ప్రకారం నడుచుకుంటుంది. రెండు కార్యాలయాలు కూడా ప్రస్తుతం హైదరాబాద్ (ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో) కార్యాలయంలోనే కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
     
    ఈ ఆర్థిక రుణ లక్ష్యం రూ. 10 వేల కోట్లు...

    గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు చెల్లింపులపై సమీక్షించిన నాబార్డు ఆ వివరాలను ఇద్దరు సీజీఎంలు వి.వి.సత్యనారాయణ,జీజీ మెమ్మేన్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2015-16 సంవత్సరానికి తెలంగాణలో రూ. 10 వేల కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.  ఏపీ లోనూ అంతే సంఖ్యలో రుణాలు ఇస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో రూ. 14,074 కోట్ల రుణ లక్ష్యం కాగా రూ. 16,183 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.

    తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయకు ప్రాధాన్యం ఇస్తున్నందున ఆర్‌ఐడీఎఫ్ సాయంగా దానికి రూ. 360 కోట్లు మంజూరు చేశామన్నారు. గోదాముల నిర్మాణానికి నాబార్డు రూ. 972 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఏపీలో డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన వర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీల్లో తరగతి గదులు, ల్యాబ్స్, హాస్టళ్ల సదుపాయాల కోసం రూ. 295 కోట్లు మంజూరు చేసిందన్నారు.
     
    ఆర్‌ఏజీల ఏర్పాటు...

    వ్యవసాయం, రైతులు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రాంతీయ సలహా గ్రూపుల (ఆర్‌ఏజీ)ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ అధికారులు, బ్యాంకర్లు, ఆదర్శ రైతు సంఘాలు, ఎన్జీవోలతో కలసి ఫోరమ్ ఏర్పాటు చేశామని సీజీఎంలు పేర్కొన్నారు. తెలంగాణలో 2,670, ఏపీలో 6,922 రైతు క్లబ్‌లను ఏర్పాటు చేశామన్నారు.
     
    2015-16లో ప్రాధాన్యాలు

    ఈ ఆర్థిక సంవత్సరంలో అగ్రి టర్మ్ లెండింగ్ ద్వారా వ్యవసాయ రంగంలో మూలధన ఏర్పాటుకు దృష్టిసారిస్తామని తెలిపారు. పథకాలను ప్రారంభించి, అమలుపరుస్తామన్నారు. రెండు రాష్ట్రాల్లో సాగు, తాగునీరు, పొడి, తడి నిల్వలు, గ్రామీణ పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ యంత్రాంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇ-పోర్టల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ తమ పాధాన్యమని సీజీఎం సత్యనారాయణ అన్నారు.  పాలీహౌస్‌లకు సాయం చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు